
మెట్పల్లి, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు జీరో, బీజేపీ ఖాతా తెరవడం కూడా కష్టమేనన్నారు. మెట్పల్లిలోని పార్టీ ఆఫీస్లో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను రక్షించుకునేందుకు ప్రధాని మోదీతో దోస్తీ చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ తీరు నచ్చకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లీడర్లు నామినేషన్ల కంటే ముందే చేతులెత్తేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడమే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అన్నారు. ఇందులో భాగంగానే మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి బోధన్, ముత్యంపేట్ ఫ్యాక్టరీలను సందర్శించి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2025 చివరి నాటికి షుగర్ ఫ్యాక్టరీల్లో క్రషర్ స్టార్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రబీ యాక్షన్ ప్లాన్లో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వని కేసీఆర్, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయంటూ జిల్లాల పర్యటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలోనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఇందుకు సంబంధించిన విధి విధానాలు రెడీ అయ్యాయని చెప్పారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్కుమార్, నాయకులు జువ్వాడి కృష్ణారావు, జెట్టి లింగం పాల్గొన్నారు.