నాగార్జున సాగర్​లో తగ్గుతున్న నిల్వలు .. నగరానికి డేంజర్​ బెల్స్​

నాగార్జున సాగర్​లో తగ్గుతున్న నిల్వలు .. నగరానికి డేంజర్​ బెల్స్​
  • కెపాసిటీ 590 అడుగులు కాగా 522 అడుగులకు నీళ్లు
  • 510 అడుగులకు చేరితే ఎమర్జెన్సీ పంపింగ్​ చేయాల్సిందే
  •  వేసవి ప్రారంభంలోనే ఆందోళనకరంగా లెవెల్స్
  • తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని ఇరిగేషన్​  శాఖకు వాటర్​ బోర్డు లెటర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్ ​హైదరాబాద్​కు తాగునీటిని అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఆందోళనకర రీతిలో తగ్గుతున్నాయి. రోజుకు దాదాపు 2 టీఎంసీల నీటిని సాగర్ ​నుంచి వివిధ అవసరాలకు ఇరిగేషన్​అధికారులు వినియోగిస్తున్నారు. సాగర్​లో నీటి నిల్వలు తగ్గితే హైదరాబాద్​తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉందని, సిటీ తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలను మెయిన్​టెయిన్​ చేయాలని వాటర్  బోర్డు అధికారులు ఇరిగేషన్​ శాఖకు లెటర్ ​రాశారు. డెడ్​ స్టోరేజీ(510 అడుగులకు)కి చేరితే ఎమర్జెన్సీ పంపింగ్​చేయాల్సి వస్తుందని వాటర్​ బోర్డు అధికారులు చెబుతున్నారు. 

గ్రేటర్​తో పాటు ఔటర్ రింగ్ రోడ్​ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు మెట్రో వాటర్​బోర్డు నీరు అందిస్తోంది. ప్రస్తుతం నగరానికి ఆరు ప్రధాన వనరుల నుంచి రోజుకు 581.35 ఎంజీడీల(మిలియన్  గ్యాలన్స్ పర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు.

 ఒక్క నాగార్జున సాగర్  నుంచే కృష్ణా ప్రాజెక్టు ఫేజ్1, 2, 3 ద్వారానే రోజుకు 275 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. మొదటి దశ ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి 163 ఎంజీడీలు, సింగరూరు నుంచి 69.07 ఎంజీడీలు, మంజీరా నుంచి 40.62 ఎంజీడీలు, హిమాయత్​ సాగర్​నుంచి 10.58 ఎంజీడీలు, ఉస్మాన్​సాగర్ నుంచి 22.50 ఎంజీడీల నీటిని సప్లయ్​చేస్తున్నారు. కాగా నాగార్జున సాగర్​లో ప్రస్తుతం ఉన్న నీటి నుంచే 6 నెలల పాటు అంటే ఫిబ్రవరి నుంచి జులై వరకు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని మెట్రో వాటర్​బోర్డు అధికారులు ఫిబ్రవరి 13న ఇరిగేషన్​ అధికారులకు లెటర్ రాశారు. కచ్చితంగా నీటి నిల్వలు మెయింటెయిన్​ చేయాల్సి ఉంటుందని తెలిపారు.


 ముందుస్తుగా ఏర్పాట్లు

ఎండలు ముదరడంతో సిటీలో రోజురోజుకూ నీటి డిమాండ్​ పెరుగుతోంది. గ్రేటర్, ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కలిపి ప్రస్తుతం 550 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్​లో నిల్వలు పడిపోతే ఆ ప్రభావం గ్రేటర్​సిటీపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఫిబ్రవరి 13 నాటికి 542 అడుగుల మేర నీరు ఉంది. నెల రోజుల్లోనే 522 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం సాగర్​ నుంచి భారీ మొత్తంలో నీరు తరలిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్​ నాటికే డెడ్​స్టోరేజీకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 సాగర్​లోని పుట్టంగండి వద్ద పంపింగ్​స్టేషన్​ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కోదండపూర్ నీటిశుద్ధి కేంద్రానికి నీటిని పంపింగ్​చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులు చేపట్టేందుకు ఆయా సంస్ధల నుంచి తాజాగా వాటర్​ బోర్డు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. సాగర్​ వద్ద ఎమెర్జెన్సీ పంపింగ్​ పనుల నిర్వహణకు దాదాపు రూ. 4.50 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులు మూడు వారాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇది పూర్తయితే ఏప్రిల్​ఆఖరు వారంలోనే నాగార్జున సాగర్​ నుంచి హైదరాబాద్​ నగరానికి ఎమర్జెన్సీ పంపింగ్​ద్వారా నీటి సరఫరా చేయనున్నారు.