
- నెలలు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్య
- ఎదురుచూపుల్లో 700 మంది రైతులు
- సీసీఎల్ఏ నిర్లక్ష్యంతో రైతులకు తప్పని ఇబ్బందులు
- పాస్ బుక్స్ లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరం
మహబూబాబాద్, వెలుగు : ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆఫీసర్ల అలసత్వం కారణంగా వందలాది మంది రైతులు పట్టాదార్ పాస్ బుక్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన 700 మంది రైతులకు పట్టాదార్ పాస్ బుక్స్ అందకపోవడంతో వారు రైతు భీమా, రైతు బంధు వంటి ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. తమకు పాస్ బుక్స్ ఇవ్వాలని ఆఫీసర్ల చుట్టూ తిరిగినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ ప్రక్షాళన నుంచే ఇబ్బంది...
ఆరేళ్ల కింద ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. ఈ టైంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలోని 1,827 ఎకరాలను ఫారెస్ట్ భూమి కింద చూపించి రైతులకు పట్టాదార్ పాస్బుక్స్ జారీని నిలిపివేశారు ఆ తర్వాత తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్లోనూ ఈ ఊరి పేరే కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతులు రిలే దీక్షలు, రాస్తారోకోలు,
ఆఫీస్ల ముట్టడి చేపట్టడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను నిలదీశారు. దీంతో స్పందించిన రెవెన్య ఆఫీసర్లు ఆఫీసర్లు ఎంజాయ్మెంట్ సర్వే చేయడంతో పాటు కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా 500 మందికి చెందిన 700 ఎకరాల భూమిని 2022లో ధరణిలో పొందుపరిచి పాస్బుక్స్ అందజేశారు. కానీ నారాయణపురం గ్రామానికి చెందిన సర్వే నంబర్లను పక్కనే ఉన్న నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామంలో ఉన్నట్లు చూపారు. దీంతో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో ఆఫీసర్లు మరోసారి సర్వే నిర్వహించి ఈ సర్వే నంబర్లను నారాయణపురానికి సంబంధించినవేనని తేల్చి పాస్ బుక్స్ అందజేశారు.
ఎదురుచూపుల్లో మరో 700 మంది
నారాయణపురం గ్రామంలోని 1,127 ఎకరాలకు సంబంధించిన మరో 700 మంది రైతులకు ఇప్పటివరకు ఎలాంటి పాస్ బుక్స్ అందలేదు. వీరి వివరాలు ధరణి వెబ్సైట్స్లో కూడా కనిపించడం లేదు. తమ సమస్యను పరిష్కరించాలని ఆఫీసర్ల చుట్టూ తిరగడంతో కలెక్టర్ శశాంక ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఆ రిపోర్టుతో పాటు, ఇతర మండలాలతో ఉన్న బార్డర్ సమస్యలను రెక్టిఫై చేసిన రిపోర్టును సైతం గతేడాది ఆగస్టు 23 సీసీఎల్ఏ కమిషనర్కు పంపించారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో రైతుల సమస్య పరిష్కారం కావడం లేదు.
ప్రస్తుతానికి నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ స్థానాల్లో ఫారెస్ట్కు బదులు పట్టా భూమిగా మార్పులు చేసినప్పటికీ, రైతులకు పూర్తిస్థాయిలో పాస్బుక్స్ అందలేదు. వారి వివరాలు ధరణిలో కనిపించడంలేదు. పట్టాదార్ పాస్బుక్స్ లేకపోవడంతో రైతులు రైతుబంధు, రైతు భీమాతో పాటు పీఎం కిసాన్ పథకానికి దూరం అవుతున్నారు. ఇటీవల కొందరు రైతులు చనిపోయినా వారికి రైతు బీమా అందలేదు. ప్రభుత్వం స్పందించి పాస్ బుక్స్ ఇవ్వాలని కోరుతున్నారు.