
- ఉన్నతాధికారులకు నివేదిక
- ప్యాకేజీ–1, 2గా జరగనున్న పనులు
మహబూబ్నగర్, వెలుగు: నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(ఎన్కేఎల్ఐఎస్) పనులను త్వరలో ప్రారంభించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని ప్యాకేజీ-–1, 2గా చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకోసం మక్తల్, ఊట్కూరు, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లోని 22 గ్రామాల్లో అధికారులు భూ సర్వే చేసి, మొత్తం 483 ఎకరాలను గుర్తించారు.
ప్యాకేజీ-1లో..
ప్యాకేజీ–-1లో ఒక పంప్హౌస్, ప్రెషర్ మెయిన్పనులు చేట్టనున్నారు. పంప్ హౌస్ కోసం 55.15 ఎకరాల భూమి అవసరం ఉండగా.. మక్తల్మండలంలోని ఎర్రనాగన్పల్లిలో 24.11, కాట్రేవుపల్లిలో 31.04 ఎకరాలకు సర్వే చేశారు. ప్రెషర్ మెయిన్ కు ఎర్రనాగన్పల్లిలో 5.04 ఎకరాలు, కాచ్వార్లో 14.19, టేకులపల్లిలో 2.11, కాట్రేవుపల్లిలో 66.02, మంథన్గోడ్లో 10.30, ఊట్కూరు మండలం ఎడవెల్లిలో 24.09, పులిమామిడిలో 1.20, పెద్దపొర్లలో 15.25, జీర్నహల్లిలో 9.27, దంతన్పల్లిలో 58.02 ఎకరాలకు భూ సర్వే చేశారు. మక్తల్ మండలంలో 98.26, ఊట్కూరు మండలంలో 109.03 ఎకరాలు కలిపి మొత్తం 263.04 ఎకరాలకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించారు.
ప్యాకేజీ-2లో..
ప్యాకేజీ–2లో రెండు పంప్ హౌస్లు, ప్రెషర్ మెయిన్, సబ్ స్టేషన్, అప్రోచ్ చానల్ కోసం భూ సర్వే చేశారు. ఊట్కూరు మండలం బాపూర్ వద్ద పంప్హౌస్ నిర్మించనుండగా.. 25.8 ఎకరాలకు సర్వే కంప్లీట్ అయింది. పేరపల్ల వద్ద మరో పంప్ హౌస్ నిర్మించనుండగా 44.4 ఎకరాలకు సర్వే చేశారు. తిప్రాస్పల్లి వద్ద సబ్స్టేషన్ కోసం 2.4 ఎకరాలు, అప్రోచ్ ఛానల్ కోసం నారాయణపేట మండలం పేరపల్ల వద్ద 3.6 ఎకరాలు, ప్రెషర్మెయిన్ కోసం దామరగిద్ద మండలం బాపన్పల్లిలో 12.5 ఎకరాలు, దామరగిద్దలో 4.4, గుడిమున్కాన్పల్లిలో 9.23, లింగారెడ్డిపల్లిలో 19.15, నారాయణపేట మండలం జాజాపూర్లో 6.6, కౌరంపల్లిలో 11.7, పేరపల్లలో 14.55, సింగారంలో 11 ఎకరాలు, స్పాయిల్ ల్యాండ్స్బాపన్పల్లిలో 30.7, బాపూర్లో 24 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి మొత్తం 220.3 ఎకరాల్లో సర్వే చేపట్టారు.
రెండో దశలో చెరువుల అభివృద్ధి
ఎత్తిపోతల పథకం పనులు రెండు దశల్లో జరగనుండగా.. మొదటి దశలో ఊట్కూరు, జాజాపూర్, జయమ్మ, కానుకుర్తి చెరువులున్నాయి. వీటి కేపాసిటీని, ఆయకట్టను పెంచనున్నారు. రెండో దశ మొత్తం కొడంగల్ నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేయనున్నారు. లక్ష్మీపూర్, ఈర్లపల్లి, దౌల్తాబాద్, హుస్నాబాద్, కొడంగల్, బొంరాస్పేట చెరువుల కెపాసిటీని పెంచనున్నారు. అలాగే, ఈ దశలో ప్రెషర్ మెయిన్స్ కాకుండా గ్రావిటీ కెనాల్స్ నిర్మించనున్నారు.