
హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు లోని రైల్ కోచ్ రెస్టారెంట్ లోని ఫుడ్ లో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయి. చూడడానికి రైలులా ఉండే రైల్ కోచ్ రెస్టారెంట్ కష్టమర్ల.. ఆరోగ్యం విషయంలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చూడటానికి వెరైటీగా ఉందని నెక్లస్ రోడ్లోని రైల్ కోచ్ రెస్టారెంట్ కు బిర్యానీ తినేందుకు వెళుతున్నారా.. అయితే ముందుగానే ఆస్పత్రిలో బెడ్ బుక్ చేసుకోవాల్సిందేనని ఈ సంఘటన బట్టి అర్దమవుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్ యాజమాన్యాలు క్లీనింగ్ విషయంలో మాత్రం మారడం లేదు. కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింకలతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు.
తాజాగా విజయ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి నెక్లెస్ రోడ్డు లోని రైల్ కోచ్ రెస్టారెంట్ కు లంచ్చేసేందుకు వెళ్లాడు. ఆ హోటల్లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. వేడి వేడిగా తీసుకొచ్చిన బిర్యానీని సగం తిన్నారు. అప్పుడే అసలువిషయం బయట పడింది. తింటున్న బిర్యానీలో బొద్దింక రావడంతో షాక్ అయిన కష్టమర్ .. రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని రెస్టారెంట్ బాధితులు తెలిపారు.