![కొత్త రేషన్ కార్డులకు మరో చాన్స్..మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ](https://static.v6velugu.com/uploads/2025/02/nizamabad-district-offers-fresh-opportunity-for-new-ration-cards_lWKoSMnIm4.jpg)
- ఇప్పటి వరకు అప్లయ్ చేయని వారే అర్హులు
- సర్కార్ చెంతకుగ్రామ సభల ఆర్జీల డేటా
నిజామాబాద్, వెలుగు : కొత్త రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చాన్స్ ఇచ్చింది. గ్రామ సభలు, ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. సోమవారం నుంచే మీ-సేవ సెంటర్లలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్తగా పెండ్లి చేసుకున్న వారు కుటుంబ కార్డులో పేర్లు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్లు ఆఫ్లైన్లో ఈ దరఖాస్తులు తీసుకుంటున్నారు.
పదేండ్ల నిరీక్షణ తొలగింది..
జిల్లాలో 4,02,473 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 12,89,889 లక్షల మందికి 6,410 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నది. పదేండ్ల కింద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు. ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెండ్లిళ్లు అయినవారు.. వారి పిల్లలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో దరఖాస్తులు తీసుకోలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే ఈ విషయాన్ని గమనించి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. రేషన్ కార్డుల కోసం 81,148 దరఖాస్తులు వచ్చాయి.
అధికారులు వాటిని ఆన్లైన్ చేసి అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. జనవరి 26న పైలెట్గా ఎంపిక చేసిన31 గ్రామాల్లో 1,066 మందికి రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మిగితా అప్లికేషన్లను తహసీల్దార్లు ఆన్లైన్ చేస్తున్నారు. దరఖాస్తుదారుడి కుటుంబం వివరాలు, ఆధార్ నంబర్, ఇన్కమ్, క్యాస్ట్, ఫోన్ నంబర్ తదితర వివరాలతో డేటాను పొందుపరుస్తున్నారు. వాటిని ప్రజాపాలన అప్లికేషన్లతో క్రాస్ చెక్ చేసి డబుల్ దరఖాస్తులు తొలగించాక కార్డులను జారీ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్కార్డులు మంజూరు కానున్నాయి. ఎవరైనా మిగిలి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
టైం లిమిట్ లేదు..
అర్హత గల ప్రతి కుటుంబానికి ఎఫ్ఎస్సీ కార్డు మంజూరవుతుంది. ఇప్పుడు తీసుకుంటున్న దరఖాస్తులు మిస్ అయిన వారి కోసమే. కొత్త పేర్ల యాడింగ్కు వెళ్లొచ్చు. ప్రజాపాలన, గ్రామ సభలో ఆర్జీలు ఇచ్చినవారు మళ్లీ చేయొద్దు. కొత్త కార్డుల మంజూరు కంటిన్యూగా నడిచే ప్రక్రియ. - అరవింద్రెడ్డి, డీఎస్వో, నిజామాబాద్
ALSO READ : పంచాయతీలకు పైసలు రాక.. కరెంట్ బిల్లులు పెండింగ్
డబుల్కు నో చెప్పేలా సాఫ్ట్వేర్..
సర్కారు ఆదేశాల ప్రకారం సోమవారం నుంచి మీ-సేవ సెంటర్లలో కొత్త రేషన్ కార్డులు, ఇప్పుడున్న కార్డులలో అదనపు పేర్ల చేరిక అఫ్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రజాపాలన, గ్రామ సభలో అఫ్లికేషన్లు ఇచ్చిన వారు మళ్లీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ వెళ్లినా సాఫ్ట్వేర్ అంగీకరించదు. ఇప్పటికే అప్లికేషన్లు పెట్టుకున్న వ్యక్తుల పేరు, ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ప్రాసెస్లో ఉన్నదని చూపుతుంది. ప్రస్తుతం స్వీకరిస్తున్న అఫ్లికేషన్లు డబుల్ అయ్యే చాన్స్లేదు. పెండ్లి అయ్యాక వేరు కాపురం ఉంటున్న ఫ్యామిలీ ఫ్రెష్ కార్డు కోసం దరఖాస్తుపెట్టుకుంటే ప్రస్తుతం ఎంటరై ఉన్న కార్డుల నుంచి పేర్లు తొలగించుకోవాల్సి ఉంటుంది. నేమ్ డిలీట్ ఆర్జీలను తహసీల్దార్లు ఆఫ్లైన్లో తీసుకుంటున్నారు. అవి ఫైనల్ అయితేనే కొత్తవి మంజూరవుతాయి.