
- జీసీ లింక్లో సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకోవడంపై ఎన్డబ్ల్యూడీఏ
- నేటి నుంచి సాగర్ ఆయకట్టు పరిధిపై అధ్యయనం
హైదరాబాద్, వెలుగు: గోదావరి, కావేరి అనుసంధానం (జీసీ లింక్)లో నాగార్జునసాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడితే తెలుగు రాష్ట్రాల నీటి హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని నేషనల్వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది. దానికి సంబంధించిన సిమ్యులేషన్స్టడీస్ను తెలంగాణ, ఏపీకి పంపించింది. కృష్ణా జలాల్లో వాటాలు తేలేవరకు సాగర్ను బ్యాలెన్సింగ్రిజర్వాయర్గా వాడుకోవడానికి వీల్లేదంటూ గతంలో జరిగిన మీటింగుల్లో తెలంగాణ తేల్చి చెప్పింది. జీసీ లింక్లో భాగంగా చత్తీస్గఢ్ వాడుకోని వాటా జలాల్లోని 148 టీఎంసీలను తమిళనాడు వరకు తరలించాలని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని యోచిస్తున్నది. అయితే, అందుకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇచ్చంపల్లికి బదులు సమ్మక్కసాగర్ను వాడుకోవాలని చెబుతున్నది. తమిళనాడుకు తరలించే జలాల్లో 43 టీఎంసీలు తెలంగాణకు ఇస్తామని ఎన్డబ్ల్యూడీఏ చెబుతున్నది. కానీ, తెలంగాణ మీదుగా తీసుకెళ్తున్నారు కాబట్టి.. సగం వాటా ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతున్నది. తరలింపులో భాగంగా 100 టీఎంసీల నీళ్లను సాగర్కు తరలించి.. అక్కడి నుంచి సోమశిలకు, అటు నుంచి తమిళనాడుకు తరలించేలా జీసీ లింక్కు ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది.
అయితే, ఇప్పుడు ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నందున సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకోరాదని, వాటాల్లో తేడాలొస్తాయని తెలంగాణ స్పష్టం చేస్తున్నది. ఈ క్రమంలోనే ఎన్డబ్ల్యూడీఏ సిమ్యులేషన్ స్టడీస్ చేసి.. ఎవరికీ నష్టం కలగదని రెండు రాష్ట్రాలకూ సూచించింది. దాంతో పాటు సాగర్ ఆయకట్టు పరిధిపైనా అధ్యయనం చేయించాలని ఎన్డబ్ల్యూడీఏ నిర్ణయించింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఎన్డబ్ల్యూడీఏ సదరన్ రీజియన్ సీఈ దేవేందర్, ఎస్ఈ నాయుడు క్షేత్రస్థాయిలో స్టడీ చేయనున్నారు. అలాగే, ఈ అంశంపై ఈ నెల 12న సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్డబ్ల్యూడీఏ తెలిపింది.