
భద్రాచలం, వెలుగు: ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన పిచ్చుకులపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం పంచాయతీలను తెలంగాణకు ఇవ్వాలనే డిమాండ్తో ప్రతిపక్షాలు ధర్నా చేశాయి. ఆదివారం రెండు రాష్ట్రాల బార్డర్లోని రాజుపేట వద్ద ఈ ధర్నా చేపట్టాయి. ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, రావులపల్లి రాంప్రసాద్, సీపీఎం లీడర్లు మచ్చా వెంకటేశ్వర్లు, బాలనర్సారెడ్డి, స్వామి, బీజేపీ నుంచి కుంజా ధర్మారావు, రామ్మోహన్రావు, నాగబాబు, నక్కా వెంకన్న, భూక్యా బాల్య, బుడగం శ్రీనివాసరావు, బోగాల శ్రీనివాసరెడ్డి, చల్లగుల్ల నాగేశ్వరరావు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
ఏపీలోని 5 పంచాయతీల్లోనే ఆందోళన చేపట్టాలని భావించినా, ఆ గ్రామాల్లో భారీగా బలగాలను మోహరించిన ఆంధ్రా సర్కార్ ఆందోళనలకు అనుమతి నిరాకరించింది. దీంతో బార్డర్కు దగ్గర ఉన్న భద్రాచలం టౌన్లోని రాజుపేట వద్ద చర్ల–భద్రాచలం రోడ్డుపై ధర్నా చేశారు. ఈ ఐదు పంచాయతీలు ఏపీలో ఉండటం వల్ల ఆ రాష్ట్రానికి ఉపయోగం లేదని, దక్షిణ అయోధ్యను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని పొదెం వీరయ్య, కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ గ్రామాలను ఏపీలో కలపడం వల్ల భద్రాచలం ముంపునకు గురవుతోందని, అందువల్ల ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించాలని ఎనిమిదేండ్లుగా ఆందోళన చేస్తున్నామని, ఇప్పుడు కొత్తగా నిరసన చేపట్టినట్టుగా కామెంట్లు చేయడం సరికాదని పేర్కొన్నారు.