
మెదక్, వెలుగు: అభివృద్ధిని కోరుకునేటోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో ఆమె ర్యాలీ అనంతరం రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. మెదక్ ప్రాంత వాసుల చిరకాల కోరికైన జిల్లా కేంద్రం, రైల్వే లైన్, ఎంసీహెచ్, 500 బెడ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ మంజూరు చేయించానని గుర్తు చేశారు. మెదక్ నియోజకవర్గ ప్రజల అవసరాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
ఈ సారి ఎమ్మెల్యేగా గెలిస్తే అన్నిరంగాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. చేను, చెలక, వాగు, వంక, సీసీ రోడ్డు, బీటీ రోడ్డు అంటే ఏమిటో తెలియని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే వృధా అవుతుందన్నారు.30వ తేదీన కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, కేసీఆర్కు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్ పాల్గొన్నారు.