
- సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అన్ని చర్యలు
- ఎప్పటికప్పుడు పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష
- ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రులు, అధికారులు
- సీఎంకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ
- పూర్తి సహకారంఅందిస్తామని హామీ
హైదరాబాద్, వెలుగు : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు.
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీఐజీ, ఐజీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తెలియజేయాలన్నారు. పూర్తి సహకారం అందిస్తాం..
సీఎంకు ప్రధాని మోదీ ఫోన్
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలియజేశారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సహాయ చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోదీ తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.