డబ్బుల కోసం భార్య వేధిస్తుందని కేసు పెట్టిన భర్త

డబ్బుల కోసం భార్య వేధిస్తుందని కేసు పెట్టిన భర్త

భర్త డబ్బుల కోసం వేధిస్తున్నాడని భార్య పోలీస్ కేసు పెట్టడం రొటీన్ అని అనుకున్నారో ఏమో కానీ ముంబాయి నగరంలో సీన్ రివర్స్ అయ్యింది. భార్యనే పైసల కోసం తనను వేధిస్తుందని ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనకు తన భార్య నుండి ప్రాణ హాని ఉందని కేసు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే అజయ్ ఠక్కర్ అనే వ్యక్తి తృప్తి ఠక్కర్ అనే మహిళను 2003లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు 2007 వరకు థాయ్ లాండ్ లో ఉద్యోగం చేసి ముంబైకి వచ్చి నివాసం ఉంటున్నారు.

 ముంబైలోని కాండివాలి అనే ఏరియాలో కొన్నేళ్లు ఉండి గోరేగావ్ ఈస్ట్‌లోని శ్రేయాస్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కొన్నారు. మరి కొన్ని రోజులకు గోరేగావ్ వెస్ట్‌లోని రుస్తోమ్‌జీ టవర్‌లో మరొక ఫ్లాట్‌ కొన్నారు. ఇవన్ని ఉమ్మడిగా కొనుగోలు చేశారు. అయితే గత కొంత కాలంగా వారి మధ్య విభేదాలు తలెత్తాయి.  దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. 

ఫిబ్రవరి 2021లో, తృప్తి, అజయ్ కు ఈ మెయిల్ చేసి, వ్యాపారం కోసం రూ. 50 లక్షలు ఇవ్వాలని, ఫ్లాట్‌లను తనకు బదిలీ చేయమని డిమాండ్ చేసింది. అయితే దీన్ని తిరస్కరించడంతో కొన్నేళ్లుగా పదేపదే డబ్బు, నగలు, కారు, ఇళ్లు, ఫ్లాట్ ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శారీరక వేధింపులకు గురి చేసిందని భర్త అజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

జూలై 5, 2023న పరస్పర విడాకుల గురించి జరిగిన సమావేశంలో రోజువారీ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం, భరణం కింద రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని చెప్పాడు. ఆమె డిమాండ్స్ ను అజయ్ తిరస్కరించడంతో తృప్తి తనకు హాని చేస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.