
ధరణి చట్టంతో రైతులు, ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తండ్రులు, తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం ఎత్తుకెళ్ళిందన్నారు. భూ యజమానుల ఇబ్బందులు తొలగించాలని ధరణిని బంగాళాఖాతంలో పడేశామన్నారు.
18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను పరిశీలించి, మేధావులతో చర్చించి భూభారతి చట్టం తయారు చేశాము. భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే అధికారులు మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తారు. పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాలను సెలెక్ట్ చేశాము. జూన్2 లోపు ఆ మండలాల్లో భూ సమస్యలు పూర్తిగా క్లియర్ చేస్తాం. జూన్ 2నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు చేస్తాం. అధికారులే మీ ఇంటికి వచ్చి దరఖాస్తులు తీసుకొని సమస్యలు తీరుస్తారని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
గత ప్రభుత్వంలో పేదల భూములను దొబ్బిన నాయకులకు దుఃఖం వస్తుందని ఫైర్ అయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే కేసీఆర్ కు దుఖం వస్తుందన్నారు దుఃఖం వస్తుందని కపట ప్రేమ చూపిస్తూ కేసీఆర్ మొన్న యాక్షన్ చేశారని ఫైర్ అయ్యారు. తన ఉద్యోగం పోయినందుకు కేసీఆర్ కు దుఃఖం వస్తుందా..? కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కేసీఆర్ కు దుఃఖం వస్తుందా.? కేసీఆర్ కు ఎందుకు దుఃఖం వస్తుందని ప్రశ్నించారు. రెండు సార్లు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినందుకే కేసీఆర్ కు దుఃఖం వస్తుందేమోనన్నారు. ఎందుకు దుఃఖం వస్తుందో కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.