
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమెను ఉక్కు మంత్రిత్వశాఖ ఎన్ఎండీసీ బోర్డులో ఫంక్షనల్ డైరెక్టర్గా నియమించింది. ఈ నియామకానికి ముందు ప్రియదర్శిని.. హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ కార్పొరేట్ ఆఫీసులోనూ, నాగర్ నర్ (చత్తీస్గఢ్) లోని ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ లోనూ పర్సనల్ విభాగంలో హెడ్ గా పనిచేశారు.
కాగా.. ఎన్ఎండీసీ బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని బాధ్యతలు స్వీకరించడంపై కార్పొరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ‘‘1992లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ప్రియదర్శిని ఎన్ఎండీసీలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి అంచెలంచెలుగా ఆమె ఎదిగారు. మైనింగ్ ఇండస్ట్రీలో మహిళలు రాణించేలా కృషి చేశారు.
అలాగే.. పారిశ్రామిక సంబంధాలు, నియామకాలు, మెడికల్ పాలసీలు, స్టేక్ హోల్డర్ మేనేజ్ మెంట్లలోనూ ఆమె క్రియాశీలకంగా పనిచేశారు ” అని ఎన్ఎండీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రియదర్శిని.. సోషల్ వర్క్లో (పర్సనల్ మేనేజ్ మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్) లో పీజీ చేశారు. అలాగే.. ఎల్ఎల్ బీ కూడా చేశారు.