
- గోదావరి, కృష్ణ జలాలు కలిసేందుకు వారధిగా రాజీవ్ కెనాల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ ఆయకట్టుకు ఊపిరి పోసేందుకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి గోదారమ్మ పరుగులు పెడుతోంది. గతనెల 27న అశ్వాపురం నుంచి బయల్దేరిన గోదావరి జలాలు రెండు, మూడు పంప్ హౌజ్ ల వద్ద ఆగుతూ ఎనిమిది రోజులకు ఎన్ఎస్పీ కెనాల్కు చేరుకున్నాయి. దీనికి వారధిగా రాజీవ్ కెనాల్ నిలిచింది. గురువారం రాజీవ్ కెనాల్ వద్ద కృష్ణమ్మను గోదారమ్మ చేరుకున్న క్షణాలు తమకు మధుర స్మృతులంటూ పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘సీతారామ’ మొదటి పంప్ హౌజ్ నుంచి..
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు ప్రాంతంలో నిర్మించిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌజ్నుంచి గతనెల 27న గోదావరి జలాలు విడుదల చేశారు. ములకలపల్లి మండలం పూసుగూడెంలో నిర్మించిన రెండో పంప్ హౌజ్ నుంచి కమలాపురంలోని మూడో పంప్ హౌజ్కు సోమవారం చేరుకున్నాయి. పూసుగూడెం, కమలాపురం నుంచి నీటి విడుదలను అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షించారు.
మూడో పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలకు జూలూరుపాడు మండలంలోని వినోభానగర్ వద్ద బుధవారం రాత్రి మంత్రి తుమ్మలతో పాటు వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు జితేశ్వి పాటిల్, ముజామ్మిల్ ఖాన్, రైతులు స్వాగతం పలికి పూజలు చేశారు. ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లాలోని ఎన్కూర్ లింక్ కెనాల్(రాజీవ్ లింక్ కెనాల్) ద్వారా సాగర్ ఎడమ కాల్వకు గోదావరి జలాలు గురువారం చేరుకున్నాయి. రాజీవ్ కెనాల్ నుంచి 52 గేట్ వద్ద ఎన్ఎస్పీ కెనాల్లో గోదావరి నీళ్లు కృష్ణ కాల్వల్లో కలుస్తున్నాయి. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 1.30లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తుమ్మల తెలిపారు.
కష్టకాలంలో ‘గోదారమ్మ’ ఊపిరి..
ప్రతీ మూడు నాలుగేండ్లకోసారి సాగర్ నీళ్లు రాక ఎన్ఎస్పీ కెనాల్ఆయకట్టు రైతులు యాసంగిలో ఇబ్బందులు పడేవారు. వానాకాలం పంటల సాగుకూ సాగర్ నీళ్లు ఆగస్టు 25 తర్వాతనే వస్తాయి. దీంతో పంటల సాగు కొంత ఆలస్యమయ్యేది. గోదావరి జలాలు ఎన్ఎస్పీ కాల్వలోకి సరైన సమయంలో రావడంతో ఖమ్మం జిల్లాలోని వైరా, కల్లూరు కెనాల్ పరిధిలోని వేలాది ఎకరాల్లోని యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాములేరు వాగుకు మళ్లించాలి..
ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం ప్రాంతాల్లో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ రెండు, మూడో పంప్ హౌజ్లు ఉన్నాయి. కానీ ఈ మండలంలోని రైతులకు గోదావరి జలాలు అందని ద్రాక్షగా మారాయి. పూసుగూడెం నుంచి కమలాపురం పంప్ హౌజ్ వెళ్లే దారిలోని రామాంజనేయపురం ప్రాంతంలో గల పాములేరు వాగులోకి గోదావరి జలాలను వదిలితే మాదారం, ముల్కలపల్లి, పొగళ్లపల్లి, రింగరెడ్డపల్లి, తదితర ప్రాంతాల్లో ని దాదాపు 200 ఎకరాల్లో యాసంగి సాగుకు ఊతమిచ్చినట్లవుతోంది. వాగుపై పలు చోట్ల చెక్ డ్యామ్లు ఉన్నాయి. వాగును నమ్ముకొని రైతులు వరితో పాటు మొక్కజొన్న నాటు పొగాకు, వేరుశనగ సాగు చేశారు. వాగులోని నీళ్లు రోజు రోజుకు ఇంకిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి గోదావరి జలాలను వాగులోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
భవిష్యత్లో 28 గంటల్లోపే..
అశ్వాపురం నుంచి గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు చేరుకునేందుకు ప్రస్తుతం 70 గంటలకు పైగా టైం పట్టింది. అశ్వాపురం నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా ఎన్ఎస్పీ కెనాల్ వరకు దాదాపు 100.4 చైనేజ్ దూరం ఉంది. ఈ మధ్యలో గల కాల్వలను అన్ని సరి చేస్తే భవిష్యత్లో కేవలం 28 గంటల లోపే ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ కాల్వలకు గోదావరి జలాలు చేరుకునే అవకాశాలున్నాయని ఇరిగేషన్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కాగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు చేరుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారం మరువలేనిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.