
ప్రాచీన వారసత్వ సంపదలను భద్రపరిచే ఐక్య రాజ్యసమితి విద్యాశాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో వీటికి తాజాగా చోటు దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా ఈ విషయాలను యునెస్కో సంస్థ వెల్లడించింది. భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించింది.
దీంతో ఇంతవరకు మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది. 'భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ మానవ దృక్పథానికి, జీవన విధానానికి పునాదులుగా భాసిల్లుతున్నాయి. మన దేశం నుంచి 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్ లో చోటు చేసుకోవడం విశేషం. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన గుర్తింపుగా ప్రధాని నరేంద్రమోదీ తన సందేశంలో
పేర్కొన్నారు. శతాబ్దాలుగా మానవ ఔన్నత్యానికి దోహదపడిన ఈ రెండు గ్రంథాలను నిక్షిప్తం చేయడమంటే కాలాతీత విజ్ఞానాన్ని సైతం పుణికి పుచ్చుకునే ప్రక్రియగానే స్వీకరించాలి.
భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందనడానికి నిదర్శనం నేటి గుర్తింపే. భారతీయ జీవన విధానానికి పునాదులుగా బాసిల్లుతున్న ఈ రెండు గ్రంథాల సారాంశాలు సర్వజనావళికి ఆచరణీయాలేనన్న విషయాన్ని ప్రపంచమూ గుర్తించింది. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు. యునెస్కో రిజిస్టర్ లో చోటు దక్కించుకున్నాయి.
ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీతాసారం నిత్య జీవన సారమైతే భరతనాట్యం భారతీయ కళల్లో ఉత్కృష్టమైంది. భగవద్గీత, భరతనాట్య విశేషాలను మరింత విస్తృతస్థాయిలో భవిష్యత్ తరాలకు తెలియచేసేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. వాటి వైశిష్టతలను భరతజాతికి పునరంకితం చేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి.
- సభావట్ కళ్యాణ్