పదేండ్లలో లక్ష కోట్లు దోచుకున్నరు : మంత్రి పొంగులేటి

పదేండ్లలో లక్ష కోట్లు దోచుకున్నరు : మంత్రి పొంగులేటి
  • రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేసి తమ నెత్తిన పెట్టారని, రూ.లక్ష కోట్లు దోచుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ పట్టణం శివునిపల్లిలో ఆదివారం జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి ఈ సభలో సీఎం రేవంత్​రెడ్డి చెక్కులు అందజేశారు. 

రూ 2.10 కోట్లతో మహిళా శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులను అందజేశారు. స్టేషన్​ఘన్​పూర్ నియోజకవర్గానికి రూ.800 కోట్లతో మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ బీఆర్​ఎస్​ దోచుకున్న సొమ్ముతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నారన్నారు. నిజాలు బయటకు వస్తాయని కేసీఆర్​అసెంబ్లీలో మాట్లాడడంలేదని విమర్శించారు. బావ, బామ్మర్దులు అసెంబ్లీ బయట సొల్లు మాట్లాడుతున్నారని 
విమర్శించారు. 

సీఎం ను సన్మానించిన కలెక్టర్..

స్టేషన్​ ఘనపూర్ లో జరిగిన సభకు చీఫ్ గెస్ట్ గా హాజరైన సీఎం రేవెంత్ రెడ్డిని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అడిషనల్ కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఆఫీసర్లు ఘనంగా స్వాగతించారు. హెలిప్యాడ్ నుంచి సభవేదిక పైకి సీఎం రావడంతో బొకేలు అందజేసి స్వాగతం పలికారు. సీఎం స్పీచ్ అనంతరం కలెక్టర్ హస్తకళలకు ప్రఖ్యాతి గాంచిన జనగామ జిల్లా పెంబర్తి నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక జ్ఞాపికతో సన్మానించారు.

కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నరు..

కాంగ్రెస్​ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే బీఆర్ఎస్​వాళ్లు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. కాంగ్రెస్​అంటే సంక్షేమం, అభివృద్ధి అని, బీఆర్ఎస్​అంటే  ప్రజలను అణగదొక్కడమన్నారు. సీఎం రేవంత్​రెడ్డి చెప్పింది చేస్తరు, చేసేదే చెప్తరని తెలిపారు. మహిళా సంఘాలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో వారిని బస్సులకు ఓనర్లను చేశామన్నారు.    

కాంగ్రెస్​అభివృద్ధి చేస్తోంది..

తెలంగాణను బీఆర్ఎస్​ దగా చేస్తే కాంగ్రెస్​ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వరంగల్​ను హైదరాబాద్​కు దీటుగా అభివృద్ధి చేయాలని కోరారు. బీఆర్​ఎస్​హయాంలో స్టేషన్​ఘన్​పూర్​వెనుకబడిందని, ఎమ్మెల్యే కడియం ప్రణాళికతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. 

రాహుల్​ను పీఎం చేయడమే లక్ష్యం 

2029లో దేశ ప్రధానిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీని చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని వరంగల్​ఎంపీ కడియం కావ్య అన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేసి సీఎం రేవంత్ వరంగల్ మామునూరుకు ఎయిర్​పోర్టను మంజూరుచేయించారన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్​ప్రభుత్వానికే దక్కిందన్నారు. వరంగల్​ నగర అభివృద్ధికి సీఎం రూ.5,500 కోట్లు మంజూరు చేశారన్నారు. 

15 ఏండ్లుగా అభివృద్ధి జరుగలేదు

గడిచిన 15 ఏండ్లలో స్టేషన్​ఘన్​పూర్​లో అభివృద్ధి జరుగలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడు ఏడాది కాలంలోనే రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు సాధించానన్నారు. సీఎం టీ20 మ్యాచ్​ఆడుతున్నారని, శాసనసభ, శాసనమండలిలో సీఎం ప్రతిపక్ష బీఆర్ఎస్​ను చెడుగుడు ఆడించారన్నారు.