వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులో ఉధృతంగా ప్రవహిస్తోన్న  జిన్నెల వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది.

ఇల్లందు నుంచి మహబూబాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు, వాగు దాటుతుండగా  వరద ప్రవాహానికి ఆగిపోయింది. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు.  స్థానికుల సహాయంతో   ఒక్కొక్కరు చేతులు పట్టుకుని ఒడ్డుకు చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.  దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శశాంక ఆరాదీశారు.  కలెక్టర్  అదేశాలతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు  ఆగిపోయిన బస్సును  యంత్రాల సహాయంతో బయటకు తీశారు.