
- మాస్కో శివారు ప్రాంతమైన బాలాశిఖాలో ఘటన
మాస్కో: కారులో అమర్చిన బాంబు పేలడంతో రష్యన్ జనరల్ మరణించారని ఆ దేశ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. రష్యన్ మిలిటరీ ఆఫీసర్ పై గత నాలుగు నెలల్లో ఇటువంటి దాడి చోటు చేసుకోవడం రెండోసారని ఆ సంస్థ పేర్కొంది. కారులో పెట్టిన బాంబు పేలడంతో రష్యన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెయిన్ ఆపరేషనల్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ యారోస్లావ్ మోస్కాలిక్ మరణించారని చెప్పింది. మాస్కో శివారు ప్రాంతమైన బాలాశిఖాలో ఈ ఘటన జరిగిందని వివరించింది.
సమచారం అందుకున్న వెంటనే అధికారులు స్పాట్ కు చేరుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అంతకు ముందే లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ డిసెంబర్ 17న చనిపోయారు. ఆ ఘటనను మరచిపోకముందే ఈ దాడి జరిగింది. ఆయన తన ఇంటి బయట ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెట్టిన బాంబు పేలడంతో మరణించారు. రష్యన్ రేడియేషన్, బయోలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్ ఫోర్సెస్కు కిరిల్లోవ్ నాయకత్వం వహించారు.