
సంగారెడ్డి టౌన్ , వెలుగు: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఆర్జీని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల ప్రధాన సమస్యలపై అధికారులు దృష్టి పెట్టి పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించి 43 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజ రాణి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీపీఓ సాయిబాబా, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.