మరో పవర్ ప్లాంట్ కు లైన్ క్లియర్ .. త్వరలో ఎస్టీపీపీలో మూడో ప్లాంటు

మరో పవర్ ప్లాంట్ కు లైన్ క్లియర్ .. త్వరలో ఎస్టీపీపీలో మూడో ప్లాంటు
  • నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్​ఈఎల్ 
  • రూ.6,700 కోట్ల  వ్యయంతో 800 మెగావాట్ల యూనిట్  
  • సర్కార్​ దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటుకు కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 
  • అందుబాటులోకి వస్తే.. సింగరేణికి ఇన్ కమ్.. నిరుద్యోగులకు ఉపాధికి చాన్స్

కోల్​బెల్ట్​/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్​ మూడో యూనిట్​ప్లాంట్ ​రానుంది. రూ.6,700 కోట్లతో నిర్మించే మూడో ప్లాంట్​పనులను భారత్​ హెవీ ఎలక్ర్టికల్స్​ లిమిటెడ్(భెల్​) దక్కించుకుంది. తొమ్మిదేండ్ల నిరీక్షణ తర్వాత ఎస్టీపీపీలో మూడో ప్లాంట్​నిర్మాణానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కొత్త ప్లాంట్​ తో  సింగరేణి సంస్థకు ఇన్ కమ్ తో పాటు వేలమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వచ్చే వీలుంది.  ఎస్టీపీపీ ఏర్పాటులో కాకా కుటుంబం కృషి ఎంతో ఉంది. మూడో యూనిట్ కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవ చూపారు. 

తొమ్మిదేండ్ల నిరీక్షణ తర్వాత..

ఎస్టీపీపీలో 1,200 రెండు యూనిట్ల(600×2 ) ద్వారా పవర్​ఉత్పత్తి  జరుగుతుంది. మరో 600 మెగావాట్ల ప్లాంట్​నిర్మాణానికి 2015 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్​శంకుస్థాపన చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో భాగంగా సూపర్​క్రిటికల్​విధానంలో 800 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చింది. కాగా.. టెండర్ల ప్రక్రియ జాప్యంతో 9 ఏండ్లుగా నిరీక్షణ తప్పలేదు. 2022లో 800 మెగావాట్ల ప్లాంట్ కు టెండర్లు పిలువగా పలు సంస్థలు అంచనా వ్యయం కంటే ఎక్కువగా కోట్​చేయడంతో రద్దు చేశారు. గతేడాది మళ్లీ టెండర్లు పిలిచారు. ఎట్టకేలకు శుక్రవారం 800 మెగావాట్ల మూడో యూనిట్​నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్​(భెల్​)సంస్థకు ఆర్డర్​ఇచ్చింది. రూ.6,700 కోట్ల విలువైన పనుల్లో డిజైన్, ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయ్​, సివిల్​వర్క్స్​ వంటివి సంస్థ చేపట్టనుంది. 

మూడు నెలల్లో పనులు షురూ

సింగరేణి బిజినెస్ ప్రధానంగా గనుల్లో బొగ్గు తవ్వి థర్మల్​విద్యుత్కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు అమ్ముతుంది.  విద్యుత్ ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు వస్తుండడంతో సంస్థ ఆ దిశగా దృష్టి సారించింది.  సొంతంగా బొగ్గు అందుబాటులో ఉండడంతో ఇప్పటికే జైపూర్​లో 1,200 మెగావాట్ల రెండు థర్మల్​యూనిట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. వందశాతం ప్లాంట్​లోడ్​ఫ్యాక్టర్​(పీఎల్ఎఫ్) సాధిస్తూ దేశంలోనే రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర విద్యుత్​ అవసరాల్లోనూ12 శాతం ఎస్టీపీపీనే తీరుస్తోంది. గత ఐదేండ్లలో  ఏకంగా 60,521 మిలియన్​యూనిట్ల కరెంట్​ను ఉత్పత్తి చేసి స్టేట్ ​గ్రిడ్​కు సప్లై చేసింది. కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్​కు ఎస్టీపీపీలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

 విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన బొగ్గు సింగరేణి యూజీ, ఓసీపీ గనులు,  శ్రీరాంపూర్​ సీహెచ్​పీ నుంచి  బొగ్గు రవాణాకు రైల్వే ట్రాక్​లైన్ ను వినియోగించుకోనుంది.  ఏటా 4 మిలియన్​ టన్నుల బొగ్గు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు షెట్​పల్లి  గోదావరి నది నుంచి 1 టీఎంసీ, కోటపల్లి మండలం దేవులవాడ వద్ద  ప్రాణహిత నది నుంచి 2 టీఎంసీల నీటిని తీసుకుంటోంది. ఇదే నీటిని షెట్​పల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి కొత్త మూడో ప్లాంట్​కు సరఫరా చేస్తారు. ఎస్టీపీపీలోనే మరో చోట నిర్మిస్తుండగా కొత్తగా భూసేకరణ అవసరం లేదు. ​-127 హెక్టార్ల స్థలంలో ప్లాంటును నిర్మిస్తారు. మూడు నెలల్లో ప్లాంట్​నిర్మాణ పనులు మొదలుపెట్టి 50 నెలల్లో పూర్తి చేసేలా  సింగరేణి ప్లాన్ చేసుకుంది. త్వరలో సీఎం రేవంత్​రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ  చేయించనున్నారు. ​ 

ప్లాంట్ ఏర్పాటుపై సర్కార్ దృష్టికి తీసుకెళ్లిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
 
జైపూర్​ఎస్టీపీపీ ఏర్పాటులో కాకా ఫ్యామిలీ కృషి ఎంతో ఉంది.  2005లో కాంగ్రెస్​సర్కార్​లో ఎస్టీపీపీ  నిర్మాణం ప్రారంభించగా అప్పటి పెద్దపల్లి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన కొడుకు అప్పటి రాష్ట్ర కార్మిక మంత్రి గడ్డం వినోద్​తమ వంతు కృషి చేశారు. 2009 –2014 వరకు పెద్దపల్లి ఎంపీగా కాకా మరో కొడుకు, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​గడ్డం వివేక్​వెంకటస్వామి ఎస్టీపీపీకి చొరవ చూపారు. ఇందుకు సుమారు 1,883 ఎకరాలను సేకరించారు. అప్పట్లో భూ నిర్వాసిత కుటుంబాలకు పర్మినెంటు జాబ్ లతో పాటు కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​జాబ్ ల్లో 80 శాతం స్థానికులకు ఇస్తామని సింగరేణి నిర్లక్ష్యం చేసింది.

 చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేక్​వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రేవంత్​రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాంనాయక్​దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి ఎస్టీపీపీలో 80శాతం కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​జాబ్ లు స్థానికులకే చెందేలా జీవో జారీ చేసింది. మరోవైపు మూడో యూనిట్​ఏర్పాటైతే నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో జాబ్ లు రావడంతో పాటు సింగరేణికి వందల కోట్ల ఇన్ కమ్ వస్తుందని పలుమార్లు వివేక్​ వెంకటస్వామి అసెంబ్లీలోనూ  ప్రస్తావిస్తూ ప్లాంట్ ఏర్పాటుకు సర్కార్​పై ఒత్తిడి పెంచారు.