హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దసరాలోపే వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. అక్టోబర్ 3 నుంచి కొత్త వీసీల నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. 3, 4వ తేదీల్లో షెడ్యూల్ ఖరారు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా బాసర త్రిపుల్ ఐటీ, మహిళా వర్సిటీ మినహా మిగిలిన 10 వర్సిటీలకు గతంలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు ఆయా వర్సిటీల వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఒక్కో వర్సిటీకి మూడు పేర్లను గవర్నర్ కు సిఫారసు చేయనుంది. కాగా.. 10 వీసీ పోస్టులకు 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 21తో వీసీల కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం అన్ని వర్సిటీలకు ఐఏఎస్ లు ఇన్చార్జి వీసీలుగా వ్యవహరిస్తున్నారు.