కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కిసాన్ సంఘ్ నాయకులు కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి సమావేశమయ్యారు. వారి వెంట కార్యకర్తలు, నేతలు తరలివచ్చినట్టు తెలుస్తోంది. అయితే కలెక్టర్ ఆఫీసులోకి కాంగ్రెస్ ముఖ్య నాయకులకు మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మీడియాను కలెక్టరేట్ లోపలికి అనుమతించలేదు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి వెళ్లగానే కలెక్టర్ కార్యాలయ గేటును పోలీసులు మూసివేశారు. ముందస్తు చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనివ్వకుండా కలెక్టరేట్ ముందు పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
అన్నదాతల సమస్యలను తీర్చాలని కలెక్టర్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. కొత్త మాస్టర్ప్లాన్ను సవరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు సమాచారం.
కామారెడ్డి రైతులకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని జిల్లా కలెక్టర్ అవమానించడం సరికాదని షబ్బీర్ అలీ అన్నారు. మాస్టర్ ప్లాన్ సవరిస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.