
- ప్రపంచంలోనే అతిపొడవైన ఇరిగేషన్ టన్నెల్ ఎస్ఎల్బీసీ
- పైపుల ద్వారా ఆక్సిజన్ పంప్ చేస్తూ పనులు
- టన్నెల్పైన మొత్తం కొండలు.. అడవులే..
- 1980లో ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసిన నాటి సీఎం అంజయ్య
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చింది రూ.500 కోట్లే
- 2026కల్లా కంప్లీట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతిపొడవైన ఇరిగేషన్ టన్నెల్.. ఎస్ఎల్బీసీ. టన్నెల్ పైన మొత్తం కొండలు.. అడవులు ఉన్నాయి. టైగర్ రిజర్వ్ ఏరియా కావడంతో అటవీ సంపదకు నష్టం వాటిల్లకుండా శ్రీశైలం ఆఫ్షోర్, కొండ కింది నుంచి ఈ టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇందులో గాలి దూరదు.. ఊపిరాడదు.. పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంప్ చేస్తుంటారు. ఇంకా 9 కిలో మీటర్ల మేర తవ్వితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అయితే, రెండు భాగాలుగా టన్నెల్ పనులు చేపడ్తున్నారు. శ్రీశైలం ఆఫ్షోర్ నుంచి వృత్తాకార సర్కిల్లో డిండి రిజిర్వాయర్ వరకు మొదటి భాగాన్ని తవ్వుతున్నారు. అక్కడి నుంచి గుర్రపు డెక్క ఆకారంలో మరో టన్నెల్ ను ఇప్పటికే తవ్వారు. రెండు రోజుల కింద ప్రమాదవశాత్తు పైకప్పు కూలడంతో 8 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది తవ్వకాలు చేపడ్తున్నారు.
ఆరు సార్లు ప్రాజెక్టు గడువు పొడిగింపు
ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికి 40 ఏండ్ల కిందే శ్రీకారం చుట్టారు. 1978లో నాటి సీఎం చెన్నారెడ్డి.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్టడీ చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. సర్వే చేసిన ఆ కమిటీ.. సొరంగం ద్వారా నీటిని తరలించాలని సిఫార్సు చేసింది. 1980లో అక్కమ్మ బిలం దగ్గర టన్నెల్ పనులకు అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల నిధులను కేటాయించారు. 1983లో ఎన్టీఆర్ హయాంలో ఎడమ కాల్వ, కుడికాల్వల పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, అక్కడి నుంచి పనులు లేట్ అవుతున్నాయన్న ఉద్దేశంతో 1995లో ప్రాజెక్ట్ ప్రతిపాదిత స్థలాన్ని మార్చారు. నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అదే. ఆ ప్రాజెక్ట్తో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నారు. అయితే, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం ఆఫ్షోర్ నుంచి కూడా టన్నెల్ తవ్వాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2010 నాటికల్లా పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, వివిధ కారణాలతో ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. దాదాపు 6 సార్లు పనుల గడువు పెంచారు. 2026 నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రాజెక్టులో భాగంగా 2 సొరంగాలతో పాటు, హెడ్రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, డిండి, నక్కలగండి, ఉదయసముద్రం సహా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రాజెక్టులో చేర్చారు. కాగా, టన్నెల్ 2 నిర్మాణ పనులు పూర్తికాగా.. టన్నెల్1లో ఇప్పటిదాకా 34.9 కిలో మీటర్ల మేర పనులను పూర్తి చేశారు.
షియర్ జోన్లో టన్నెల్ వర్క్ ఏరియా
గత బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో ప్రాజెక్టుకు కేవలం రూ.500 కోట్లే కేటాయించి చేతులు దులుపుకున్నది. 2019, 2020, 2021 కలిపి రూ.10 కోట్లేనంటే ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆ నిధులు కనీసం నిర్వహణ ఖర్చులకూ సరిపోయే పరిస్థితి ఉండదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతం షియర్ జోన్లో ఉందని అధికారులు అంటున్నారు. అంటే మట్టి, గులక, రాళ్లు కలగలిపిన జోన్. కొన్నేండ్లుగా పనులు పెండింగ్లో ఉండటంతో వాటర్ లీకేజీలు ఏర్పడి భారీ సీపేజీ వచ్చిందంటున్నారు. ఇలాంటి ప్రాంతాలను రాడార్లు, సెన్సర్లతో గుర్తించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి నిరుడు బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టు కోసం రూ.800 కోట్లు కేటాయించింది. పనులు పున:ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టింది. ఆ తర్వాత నిరుడు అక్టోబర్లో రూ.4,637 కోట్ల నిధులను విడుదల చేశారు. పనులకు సంబంధించి ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో సర్కారు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకుఅనుగుణంగా ప్రాథమిక పనుల కోసం రూ.50 కోట్లు ఖర్చవుతాయని చెప్పగా.. సర్కారు ఆ నిధులనూ విడుదల చేసింది. టన్నెల్బోరింగ్ మెషిన్ను తెప్పించడంతో వారం కింద పనులను అధికారులు ప్రారంభించారు.
టన్నెల్ 1: దోమలపెంట (మన్నెవారిగూడెం)
నుంచి డిండి రిజర్వాయర్ వరకు
- టన్నెల్ పొడవు 43.93 కిలో మీటర్లు
- టన్నెల్ వెడల్పు/వ్యాసం 10 మీటర్లు
- పనులు పూర్తయిన (లైనింగ్సహా) 9.2 మీటర్లు
- వాటర్ డిజైన్ కెపాసిటీ 4,000 క్యూసెక్కులు
- మ్యాగ్జిమమ్ కెపాసిటీ 5,570 క్యూసెక్కులు
టన్నెల్ 2: నల్గొండ జిల్లా చందంపేట
(తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ)
- టన్నెల్ పొడవు 7.13 కిలో మీటర్లు
- టన్నెల్ వెడల్పు/వ్యాసం 9.8 మీటర్లు
- లైనింగ్తో కలిసి పూర్తయిన వ్యాసం 8.758 మీటర్లు
- వాటర్ డిజైన్ ఫ్లడ్ 4,000 క్యూసెక్కులు
- మ్యాగ్జిమమ్ కెపాసిటీ 4,495 క్యూసెక్కులు