అర్హులందరికీ గృహజ్యోతి వర్తించేలా.. విద్యుత్​ శాఖ కసరత్తు

 అర్హులందరికీ గృహజ్యోతి వర్తించేలా.. విద్యుత్​ శాఖ కసరత్తు
  • చర్యలు తీసుకుంటున్న అధికారులు

మెదక్​, వెలుగు: అభయహస్తం ఆరు గ్యారంటీ స్కీం బెనిఫిట్స్ అర్హులు అందరికీ అందించడంపై రాష్ట్ర  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆహార భద్రత కార్డు ఉన్న వారికి గృహలక్ష్మీ స్కీం వర్తింప జేస్తోంది. ఇందులో భాగంగా 200 యూనిట్స్ లోపు కరెంట్ వినియోగించే ఇళ్లకు  విద్యుత్​ శాఖ అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారు. కాగా వివిధ కారణాల వల్ల అర్హులైన కొందరు విద్యుత్​ వినియోగదారులు గృహలక్ష్మీ స్కీం బెనిఫిట్​పొందలేకపోతున్నారు.

 ఈ నేపథ్యంలో సర్వే చేపట్టిన విద్యుత్​శాఖ అర్హులైన వారందరికి జీరో బిల్లు వర్తింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 2,07,643 గృహ విద్యుత్​కనెక్షన్​లు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో నెలకు 200 లోపు యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తున్న1 లక్షా 24 వేల 370 మంది విద్యుత్​ వినియోగదారులకు  గృహజ్యోతి స్కీం వర్తిస్తోంది. ఇప్పటి వరకు రూ.23 కోట్ల, 54 లక్షల సబ్సిడీ పొందారు. ఉదిలా ఉండగా ప్రజా పాలనలో దరఖాస్తు నింపేటప్పుడు వివరాలు తప్పుగా రాయడం, సాంకేతిక కారణాల వల్ల  మరి కొందరికి గృహజ్యోతి అమలు కావడం లేదు. అలాంటి వారు ఆధార్​ కార్డు, రేషన్​కార్డుతో వెళ్లి మండల పరిషత్​ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రంలో సంప్రదిస్తే వారికి గృహ జ్యోతి స్కీం కింద బెనిఫిట్​ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

23 వేల ఇళ్లకు మీటర్లు లేవు..

గృహ జ్యోతి స్కీం అమలు నేపథ్యంలో విద్యుత్​శాఖ అధికారులు జరిపిన సర్వేలో జిల్లాలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ వాడల్లోని 23 వేల ఇళ్లకు కరెంట్ మీటర్లు లేనట్టు గుర్తించారు. ఆయా ఇళ్లకు కరెంట్ సరఫరా అవుతుంది. కానీ మీటర్లు లేని కారణంగా ఆయా వినియోగదారుల నుంచి బిల్లు రూపంలో రావాల్సిన ఆదాయాన్ని విద్యుత్ శాఖ కోల్పోతోంది. అంతేగాక ఆ ఇళ్లలో 200 లోపు విద్యుత్​ వినియోగించే వినియోగదారులు మీటర్​ లేక పోవడం వల్ల గృహజ్యోతి స్కీమ్ బెనిఫిట్స్ పొందలేక పోతున్నారు. 

ఈ నేపథ్యంలో లేని అన్ని ఇళ్లకు మీటర్లు బిగించడంపై విద్యుత్ శాఖ దృష్టి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ వాడల్లో మెజారిటీగా పేదలే ఉన్నందున ఎక్కువ శాతం మంది 200 లోపు యూనిట్లు వినియోగించే వారే అధికంగా ఉంటారు. కరెంట్​ మీటర్లు బిగిస్తే వారందరూ గృహజ్యోతి స్కీం కింద ఉచిత కరెంట్​ పొందుతారు. మీటర్లు లేని ఇళ్ల అంశంపై సీఎండీ స్థాయిలో రివ్యూ జరుగుతోందని, కరెంట్​ వినియోగిస్తున్న అన్ని ఇళ్లకు మీటర్లు ఏర్పాటు చేసి అర్హులైన వారందరూ గృహజ్యోతి స్కీం బెనిఫిట్​ పొందేలా చర్యలు తీసుకోనున్నట్టు విద్యుత్​ శాఖ సూపరింటెండెంట్​ఇంజనీర్​శంకర్​ తెలిపారు.