
- బారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులు
- పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీచార్జ్
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని హైదరాబాద్సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ల ఆందోళన కొనసాగింది. యూనిర్సిటీని ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవద్దంటూ వర్సిటీ స్టూడెంట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం క్లాసులను బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. వారికి వర్సిటీ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్స్టాఫ్ మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు చేతులో పట్టుకొని ‘‘భూమిని అమ్మొద్దు.. వర్సిటీ పేరుపై రిజస్ట్రేషన్ చేయాలి’’ అంటూ నినదించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ.. అంబేద్కర్ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వైపు ర్యాలీగా వెళ్లారు. అప్పటికే ఈస్ట్ క్యాంపస్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
విద్యార్థి సంఘాల నాయకులు బారికేడ్లు నెట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్లడంతో.. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. విద్యార్థులను చెదరగొట్టారు. ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవ్వరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఈస్ట్ క్యాంపస్ నుంచి హెచ్ సీయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. అందరూ కలిసి వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. స్టూడెంట్లను పోలీసులు వ్యాన్లలో ఎక్కించి సైబారాబాద్కమిషనరేట్పరిధిలోని శివారు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
డ్రోన్ ఎగరవేసిన ముగ్గురు అరెస్ట్
కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిపై డ్రోన్ ఎగరవేసిన ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 8:30 గంటలకు బంజారాహిల్స్ కు చెందిన అడ్వకేట్ రోహన్ నాగిరెడ్డి, జూబ్లీహిల్స్ కు చెందిన సివిల్ ఇంజినీర్ సాయి విజయ రెడ్డి.. రాత్రి 11:30 గంటలకు మణికొండ కు చెందిన ఓ ఐటీ కంపెనీలో అనలిస్టుగా పనిచేసే అరుణ్ నాయర్ డ్రోన్ ఎగరువేశారని టీజీఐఐసీ అధికారులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.