
- ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ, వెలుగు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడీని కోర్టు ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు-న్న మిథున్ రెడ్డిని మాత్రం ఇంకా నిందితుడిగా చేర్చలేదు. అయితే, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.... ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బెయిల్ ఎలా ఇవ్వగలమని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ ఉత్తర్వులను మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్బంగా వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.