
- దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు: సుప్రీంకోర్టు
- దత్తత తీసుకున్న వారు కాదు.. పర్చేజ్డ్ చిల్ర్డన్ అని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు:రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దత్తత పేరుతో చిన్న పిల్లల్ని కొనుగోలు చేసిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల పసిగుడ్డును కొనుగోలు ద్వారా ఎలా దత్తత తీసుకుంటారని, ఇదెక్కడి మానవత్వం అని ప్రశ్నించింది. 2024 మే నెలలో హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో.. 15 మంది చిన్నారులను కొనుగోలు చేసిన కేసు దాఖలైంది. ఈ కేసులో తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన సింగిల్ బెంచ్ కొనుగోలు చేసిన పేరెంట్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులపై స్టేట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్.. హైకోర్టులోని డివిజన్ బెంచ్లో అప్పీల్ కు వెళ్లింది. ఈ అప్పీల్ పై వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదన విన్నాకే ఉత్తర్వులు ఇవ్వాలని కేవియట్ వేసింది.
ఈ పిటిషన్ పై మంగళవారం జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తల్లిదండ్రుల తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. పిల్లలు లేకపోవడంతో పిటిషనర్లు ఈ పిల్లల్ని దత్తత తీసుకున్నట్లు బెంచ్ కు తెలిపారు. పిల్లలతో రెండేండ్లుగా ఎమోషనల్ అటాచ్ మెంట్ పెరిగిందని చెప్పారు. అయితే ఎప్పుడైతే పోలీసులు ఆ పిల్లల్ని తీసుకుపోయారో అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారని తెలిపారు.
అందువల్ల సుప్రీం కోర్టు విస్తృత అధికారాలను ఉపయోగించి తాము తీసుకున్న పిల్లల్ని తమకు ఇప్పించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కలుగజేసుకొని సుప్రీంకోర్టు విశేషాధికారలతో ఇల్లీగాలిటీని, లీగల్ అని చెప్పలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులపై సింపతి చూపించగలం తప్ప.. వారు చేసింది న్యాయపరంగా కరెక్ట్ అని చెప్పలేమని పేర్కొంది. వారు బయాలాజికల్ పేరెంట్స్ నుంచి చిన్నారులను దత్తత తీసుకున్న వాళ్లు కాదు.. పర్చేజ్ చేసిన వాళ్లు అని కామెంట్ చేసింది. కేసు తదుపరి విచారణ ను వచ్చే నెల 7న చేపడతామని.. విచారణ వాయిదా వేసింది.