ఆధ్యాత్మికం: ఆనందంగా జీవించాలంటే ఎలా బతకాలో తెలుసా..

ఆధ్యాత్మికం: ఆనందంగా జీవించాలంటే ఎలా బతకాలో తెలుసా..

స్వామిజీ ఈ సంపద, బంధాలు, సౌకర్యాల వల్ల ఏర్పడిన భౌతిక సుఖాలు చివరికి దుఃఖాన్నే మిగులుస్తాయని మీరు అంటున్నారు. కానీ, మాకు మాత్రం అలా అనిపించడం లేదు. కార్లు, భవనాలు, మంచి ఫుడ్, ఆధునిక సౌకర్యాలతో మేం సుఖంగా బతుకుతున్నాం కదా?" అని స్వామి వివేకానంద అమెరికా టూర్లో ఉన్నప్పుడు ఒక అమెరికన్ అడిగాడు. అవును! మీరు సుఖాలనే అనుభవిస్తున్నారు. అలా అని అనుకుంటున్నారు' అని అప్పుడు తన ప్రసంగం కొనసాగించారు.

అవును మీరు సుఖాలను అనుభవిస్తున్నామనే అనుకుంటున్నారు. కానీ, దాని వల్ల మీకు నిజమైన సంతోషం ఏమీ కలగడం లేదు. ... సుఖం ఎలాంటిందంటే  భయం భయంగా పొరుగింట్లో దూరి ఆ ఇంటి ఓనర్ ఎక్కడ చూసి కొట్టి తరుముతాడోనని హడావిడిగా, దొంగ చూపులు చూసుకుంటూ గిన్నెల్లో ఉన్న తిండి ఒక కుక్క ఎలా తింటుందో. శ్రీమంతులం అనుకునేవాళ్లు కూడా అచ్చం అలాగే అనుభవిస్తున్నారు. మీ జీవితం పైకి సంతోషంగా, ఉల్లాసభరితంగా కనిపిస్తుంది. కానీ లోలోపలంతా విషాదమే చివరికి బాధగా, ఆ తర్వాత దు:ఖంగా మారుతుంది. వైరాగ్యంతో బతుకుతున్న మాలాంటి వాళ్ల చూస్తే పైకి ఈ లోకానికి అక్కర్లేని వాళ్లలాగా కనిపిస్తారు. కానీ, వాళ్లలో లోపలంతా పరమానందం, స్థిరత్వం నిండి ఉంటాయి! అన్నారు స్వామి వివేకానంద.

పిచ్చివాడిలా కనిపిస్తాడు..

భౌతిక ప్రపంచంలో పడి కొట్టుకుపోవాలి అనుకునేవాళ్లకు ఆనందం ఎప్పుడూ చాలా దూరంలో ఉంటుందని వివేకానందుడి లాంటి జ్ఞానులు ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తూ వస్తున్నారు. పరమాత్మస్వరూపమైన ప్రకృతిపై ఆధారపడి పరిమితమైన వస్తు సంపదలతో జీవితాన్ని సరళంగా మార్చుకోవాలని మన మేలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఆది శంకరాచార్యులు కూడా తన శిష్యులకు చెప్పాడు. "దారిలో దొరికిన గుడ్డ పేలికలతో చేసిన బొంతను చుట్టుకొని, పాపపుణ్యాల ప్రభావం తన మీద పడకుండా.. మనసంతా పరమాత్వపైనే నిలిపి ఉంచే యోగి లోకానికి పిల్లాడిలా పిచ్చివాడిలా కనిపిస్తాడు! అని తన శిష్యులకు 'భజగోవింద స్త్రోత్రం చెప్పాడు.

సరళం నుంచి సంక్లిష్టానికి ..

సంతోషంగా, సరళంగా సాగిపోయే జీవితాలనుఎవరికి వాళ్లే సంక్లిష్టం చేసుకుంటూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. భౌతిక ప్రపంచాన్ని నిర్మిస్తూ. దాన్ని వస్తువులతో నింపడంలోనే పుణ్యకాలం గడిపేస్తున్నారు. ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాల్చిన జీవితాల్ని బంగారు పంజరాల్లో  బంధించుకుంటున్నారు. వివేకాన్ని కోల్పోయి అవసరాలకు, విలాసాలకు మధ్య ఉండే భేదాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వివేకం అనే తాళాన్ని ఎక్కడో జార విడుచుకున్నారు. కాబట్టి జైలు పక్షుల్లా బతుకుతున్నారు.  పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తనది కానిదాని కోసం వెంపర్లాడుతున్నారు. లోభగుణం వల్ల. రోజంతా ఊపిరి ఆడనంత బిజీగా కాలం గడుపుతున్నారు. ఇప్పుడు ఉన్నదానితోసంతృప్తి పడి సంతోషంగా ఉందామనే విషయాన్ని మర్చిపోయి.. భవిష్యత్తుకోసం పరిగెడుతున్నారు. వేలపూల చుట్టూ తిరిగి తిరిగి తేనేతుట్టెను పెట్టినా, తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా రుచి చూడని తేనెటీగల్లా మారిపోతున్నారు. అందుకే తేనెటీగలు కూడబెట్టిన తేనే ఇతరుల పాలైనట్లు... లోభులు సంపాదించిన ధనం కూడా పరుల పాలవుతుంటే  తప్ప సంపాదించిన వాడికి ఉపయోగపడదు.

ALSO READ | ఆధ్యాత్మికం : నిజమైన సంతోషం అంటే ఏంటీ.. అది ఎక్కడ దొరుకుతుంది.. సంతోషానికి దారెటు..

దొరికిందే తిని, కదలకుండా ఉండే కొండ చిలువ కూడా చాలా కాలం బతుకుతుంది. నేను ఎన్నో ఏళ్లు ఒక కొండ చిలువని చూసి ఈ పాఠం నేర్చుకున్నా. అందుకే నేనూ ఏకాంతవాసం చేస్తున్నా' అని అజగరముని  ప్రహ్లాదుడితో అంటాడు.

సంసారంలో పడి

మనిషికి సంసారమనే పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే తెలుసు. కానీ, బయటపడే దారి మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఈతరాకపోయినా జలకాలాడాలన్న మోజుతోసరస్సులో దూకడం ఎంత అవివేకమో.. కొంచెం కూడా ఆలోచించకుండా సంసారంలోపడిపోవడం కూడా అంతే అవివేకం! 

ఇప్పుడు చాలామంది ఇలా కనీసం ఆలోచించకుండానేసంసార సాగరంలో దూకుతున్నారు. యోగులు సంపాదంపై ఆసక్తి వదులుకొని బ్రహ్మానందంలో తేలిపోతుంటారు. కానీ, వాళ్లను చూసి ఈ లోకం పిచ్చివాళ్లని అనుకుంటుంది.నిజానికి సంసారంలో ఉన్నవాళ్లే పిచ్చివాళ్లు.శాశ్వతం కానీ సంపదలకోసం, పదవులకోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పిచ్చివాళ్లలా పరుగులు పెడుతుంటారు" అని అంటాడు.స్వామి జ్ఞాననాదానంద.

శరీర మాయలో...

సుఖాలకు అలవాటు పడిన మనిషి తన నిజ స్వరూపాన్నే మర్చిపోతున్నాడు. ఇల్లూ, పిల్లలే శాశ్వతం అనుకొని వాళ్ల భవిష్యత్తు కోసం పాపపుణ్యాల చక్రంలో ఇరుక్కుపోతాడు. ఫిలాసఫికల్ గా చూస్తే, పాపం ఇసుప సంకెళ్లు  అయితే. పుణ్యం పసిడి సంకెళ్లు... నిజానికి రెండూ బందానికి. భారానికీ కారణమే! పాపకర్మలతో పాటు, పుణ్య కర్మలు కూడా మళ్లీ  మనిషిని జనన.. మరణ ప్రవాహంలో పడేస్తాయి. అందుకే ఆ రెండింటికీ అతీతంగా అడుగులువేసినప్పుడే మనిషి విముక్తుడవుతాడు

ఎదిగే కొద్దీ మనిషి ముఖంలో నిర్మలత్వం పోయి కఠినత్వం  వచ్చి చేరుతుంది. పసిపిల్లవాడిలా ఉన్నప్పుడు కళ్లు తేటగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కళ్లలో కాంతి మాయమవుతూ ఉంటుంది . మనసుపై మరకలు పడతాయి. ఎప్పుడూ ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. అందుకే పసిపాపల్లా ప్రశాంతంగా నవ్వలేరు మంచిగా ఆలోచించనూ లేరు.  పసిపిల్లాడిలా ఎవరి లోకంలో వాళ్లు ఉండగలిగితే.. అంతకు మించిన యోగత్వం మరొకటి లేదు. పరిసరాలతో సంబంధం లేకుండా అంతరంగంలో ఆనందమయ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి.. ఆ ఆత్మానందంలో మునిగిపోవాలి. పూట పూటకో గందరగోళం మధ్య బతికే ఈ రోజుల్లో ఆదెలా సాధ్యమవుతుందని చాలా మందికి సందేహం రావొచ్చు. కానీ, సంసార జీవితంలో ఉన్నవాళ్లకి పరమానందాన్ని అనుభవించడం సాధ్యం కాదని బాధ పడాల్సిన అవసరం లేదు... 

ఎందుకంటే.. 'యోగులు రెండు రకాలు, వ్యక్తయోగి, గుప్తయోగి, సంసారంలో గుప్తయోగిలా జీవించవద్దు. సంసార జీవితంలో పరిత్యాగం మానసికంగానే ఉంటే సరిపోతుంది అనేవారు శ్రీరామకృష్ణ పరమహంస. అలా ఈ లోకంలో ఉంటూనే గుప్త యోగిలా తమ బాధ్యతలూ నిర్వర్తించవచ్చు. పరమానందాన్ని అనుభవించవద్దు.

–‌‌వెలుగు, లైఫ్​–