నస్పూర్, వెలుగు: వయో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టాస్క) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పి.శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, వయోధికుల పోషణ సంక్షేమ చట్టం 2007 రూల్ 20 కచ్చితంగా అమలు చేయాలన్నారు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ణీత సమయంలో తీర్పును వెలువరించి అమలుచేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
సీనియర్ సిటిజన్ల కొరకు ప్రతి మండలంలో డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, ఉచిత వైద్యం, ఉచిత రైల్వే, బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని, వయోవృద్ధుల సంక్షేమానికి బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని కోరారు. వృద్ధులకు పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని, వృద్ధులను గెంటేస్తే సెక్షన్ 24 ప్రకారం విధించే శిక్ష, జరిమానాలను పెంచాలన్నారు. ఈ సందర్భంగా టాస్క జిల్లా ఉపాధ్యక్షుడిగా నస్పూర్ పట్టణానికి చెందిన చిలువేరు సదానందంను నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కనకయ్య, కలవేని సమ్మయ్య, కె.నరసింహారెడ్డి, గండ్ర రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.