
పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. యూనివర్శిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుగా మార్చడానికి అసెంబ్లీ ఆమోదం తెలుపుతున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.
పొట్టి శ్రీరాములు తెలువు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చ సందర్బంగా మాట్లాడిన సీఎం రేవంత్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు అనేది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిందన్నారు. తెలంగాణ కోసం పనిచేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే పేర్లు మార్చుతున్నట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చలో సందర్భంగా.. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించందని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను ఎవరూ తక్కువ చేయడం లేదని, గాంధీ ఆదర్శంతో ప్రాణత్యాగంతో మద్రాస్ నుంచి ఆంధ్ర ఏర్పాటుకోసం ఆయన చేసిన త్యాగాన్ని ఎవరూ తక్కువగా చూడటం లేదని అన్నారు. అదే సందర్భంలో తెలంగాణ వైతాళికులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణ వెటర్నరీ యూనిర్సిటీకి పీవీ నరసింహరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. అదే కోణంలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకోవడం సముచితం అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలుగు యూనివర్సిటీకి ఆంధ్రాలో అదే పేరు కొనసాగుతోంది. కానీ తెలంగాణలో కొత్త నామకరణం చేయడం జరిగిందని అన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణకు అసలు భాషనే లేదు అన్న సందర్భంలో గోల్కొండ పత్రిక ప్రారంభించి కవులను ఏకథాటిపైకి తెచ్చి నడిపించారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సురవరం సేవ మరువలేనిదని అందుకే ఆయన పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టడం సముచితం అని అన్నారు.