డబుల్​ ఇండ్లపై మళ్లీ ఆశలు

డబుల్​ ఇండ్లపై మళ్లీ ఆశలు
  • స్పీడ్​ అందుకోని డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల పెండింగ్​ పనులు 
  • పనుల కోసం నిధుల మంజూరు
  • డబుల్​ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

మహబూబాబాద్, వెలుగు: గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణాలు కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలో 26,284 డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను మంజూరు చేసినా, కొన్నిచోట్లనే నిర్మాణాలు పూర్తి చేసి, పంపిణీ చేశారు. 

అనేక చోట్ల వివిధ దశల్లో డబుల్​ బెడ్​రూమ్​ల పనులు నిలిచిపోగా, కొన్నిచోట్ల నేటికీ పనులు ప్రారంభించలేదు. కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ, గతంలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి 2025_26 రాష్ట్ర బడ్జెట్​లో  రూ.305.03 కోట్లను మంజూరు చేయడంతో మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ..

గతంలో వివిధ కారణాలతో డబుల్​ బెడ్​రూమ్​నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోగా, తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆఫీసర్లు కాంట్రాక్టర్లకు నోటీసులను జారీ చేస్తున్నారు. పెండింగ్​పనులు చేపడితే బిల్లులు చెల్లిస్తామని తెలుపుతున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు మెటీరియల్​ కాస్ట్​ పెరుగడంతో నిర్మాణానికి ముందుకు రాకుంటే వారి కాంట్రాక్ట్​ను రద్దు చేసి, కొత్త వారికి నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నారు.

జిల్లాల వారీగా డబుల్​ బెడ్​ రూమ్​ల వివరాలు

జిల్లా    మంజూరైన ఇండ్లు    పూర్తైనవి     వివిధ దశల్లో ఉన్నవి    ప్రారంభం కానివి
మహబూబాబాద్    5567    2503    1963    1101
హనుమకొండ    4326    2143    2076    107
జయశంకర్​భూపాలపల్లి  3882    1613    926    1343
జనగామ    4393    1454    1566    1373
ములుగు    1783    916    620    247
వరంగల్లు    6333    2300    1503    2530

పెండింగ్​ పనులను పూర్తి చేయాలి

తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రారంభించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో, వివిధ దశల్లో పనులు నిలిచిపోయాయి. పట్టణంలో సొంత ఇంటి స్థలం లేక నిరుపేదలు ఇండ్లను నిర్మించుకో లేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతోపాటు, పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి నిరుపేదలకు అందజేశారు. వెంటనే పనులు ప్రారంభమయ్యేలా ఆఫీసర్లు, అధికార పార్టీ నాయకులు కృషి చేయాలి.- అలిసేరి రవిబాబు, తొర్రూరు పట్టణం