
- డీపీఆర్ రెడీ చేస్తున్న ఆఫీసర్లు
- లేటెస్ట్ మిషనరీ ఏర్పాటు చేసే చాన్స్
- ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్
- ఏటా పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగు
గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర గతంలో మూతపడిన ఆయిల్ మిల్ స్థానంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులు డీపీఆర్ రెడీ చేస్తున్నారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
వచ్చే ఏడాదిలోగా ప్రొడక్షన్ ప్రారంభించాలన్న టార్గెట్తో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయిల్ ఫెడ్ ఎండీ, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఇటీవల పాత మిల్లును, ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించారు. దీంతో జిల్లాకు చెందిన వారితో పాటు చుట్టుపక్కల రైతులు కూడా ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఏడాదిలో ఫ్యాక్టరీ ఏర్పాటు
బీచుపల్లిలో గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ఫ్యాక్టరీ రెండు షిఫ్ట్లలో పని చేయాలంటే పదివేల ఆయిల్ పామ్ దిగుబడి రావాల్సిఉంటుంది. గద్వాల జిల్లాలో ప్రస్తుతం 6,742 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏటా ఆయిల్పామ్ సాగు పెరుగుతోంది.
2020–21లో పైలెట్ ప్రాజెక్టుగా 250 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని భావించగా ఆ ఏడాది 1,500 సాగయ్యింది. 2021-– -22 లో 2,862 ఎకరాలు, 2022-–- 23 లో 1,610 ఎకరాలు, ఈ ఏడాది 540 ఎకరాల్లో తోటలు వేశారని ఆఫీసర్లు చెబుతున్నారు. మొదట సాగయిన 250 ఎకరాల్లో పంట ఇప్పుడు కోతకు వస్తుందని, ఈ గెలలను ఆశ్వరావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి తొలుతారని చెప్పారు. బీచుపల్లి ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చేనాటికి గద్వాలతో పాటు ఈ ఫ్యాక్టరీ పరిధిలోకి వచ్చే నారాయణపేట జిల్లాలోనూ పామాయిల్ తోటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మూతపడిన మిల్లులోనే కొత్త ఫ్యాక్టరీ
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. రూ 193 ఉన్న ఒక మొక్కను రూ. 20కే ఇస్తున్నారు. మిగతా రూ. 173 సర్కారు సబ్సిడీగా ఇస్తోంది. ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటలు సాగు చేసుకునేందుకు ఎకరానికి ఏడాదికి రూ 2,100 చొప్పున నాలుగేళ్ల పాటు ప్రోత్సాహాకాన్ని ఇస్తోంది. 12 ఎకరాల వరకు సబ్సిడీ మీద డ్రిప్ పరికరాలను ఇస్తోంది. బై బ్యాక్ అగ్రిమెంట్ ఉండడంవల్ల రైతులకు మార్కెట్ సమస్యలు ఉండవు. బీచుపల్లిలో మూత పడిన విజయ ఆయిల్మిల్లులోనే పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారు.
పాత మిల్ కు సంబంధించి బిల్డింగులు, గోదాములు, షెడ్లను ఆఫీసర్లు పరిశీలించారు. అందులో ఏవి పనికొస్తాయో.. వేటిని కూల్చివేయాలో నిర్ణయించేందుకు ఇటీవల నిపుణుల బృందం తనిఖీ చేసింది. ఈ బృందం రిపోర్ట్ ఆధారంగా సివిల్ వర్క్స్ కు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అందజేయనున్నారు. సివిల్ వర్క్స్ వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఆ తర్వాత మిషనరీ ఏర్పాటు చేస్తారు.