
- మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలతో ప్రపంచానికి తేటతెల్లమైంది. సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామం. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన రిపోర్టుతో కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిపించింది.
అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వస్తాయని గతంలోనూ అనేక సార్లు నిరూపితమైంది. ఈరోజు కూడా అదే జరిగింది. రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన విధ్వంసమే విధానంగా సాగుతున్నది. నాడు హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చి అరాచకం. నేడు బుల్డోజర్లతో పర్యావరణ హననం. మాకు న్యాయస్థానాల మీద ఎంతో గౌరవం ఉంది. అందుకే బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరుఫున సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చాం. ఆధారాలతో సహా వాస్తవాలు వివరించాం” అని ఎక్స్ లో పిలుపునిచ్చారు.