
అచ్చంపేట, వెలుగు : తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన గుండాల కుమార్, దేవి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కుమార్ అనారోగ్యంతో నాలుగేండ్ల చనిపోయాడు. అప్పటి నుంచి దేవి కూలి పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. ఇటీవల ఆమె కూడా అనారోగ్యానికి గురి కావడంతో నాలుగు రోజుల కింద చనిపోయింది.
దీంతో జయంత్(9), నిహారిక (7), అఖిల్(6) అనాథలుగా మిగిలారు. అరవై ఏండ్లు ఉన్న నాన్నమ్మ పుల్లమ్మ తప్ప ఎవరూ తోడు లేకపోవడంతో పిల్లలు ఎలా బతుకుతారో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాథలైన ముగ్గురు చిన్నారులను ప్రభుత్వంతో పాటు, దాతలు ఎవరైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.