రామాలయం అభివృద్ధికి కలిసి రావాలి

రామాలయం అభివృద్ధికి కలిసి రావాలి

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.60.20 కోట్లు మంజూరయ్యాయని, వీటితో పనులు చేపట్టేందుకు అవసరమైన భూసేకరణకు నిర్వాసితులు సహకరించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఆర్డీవో దామోదర్​ పిలుపునిచ్చారు. భద్రాచలం గ్రామపంచాయతీ ఆఫీస్​లో శుక్రవారం పీసా గ్రామసభ  నిర్వహించారు. 

పట్టణంలోని పలు కాలనీల నుంచి ప్రజలు వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పీవో, ఆర్డీవో మాట్లాడుతూ.. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందజేస్తామని ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో ఉండే ఇంటి యజమానులు సర్వేకు సహకరించాలని సూచించారు. కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు సరెళ్ల నరేశ్​​మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించినా, భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రేవంత్​రెడ్డి సర్కారు నిధులు ఇచ్చిందని తెలిపారు. 

ఎవరూ భయపడొద్దని, నిర్వాసితులందరికీ చట్ట ప్రకారం ప్యాకేజీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అయితే బొమ్మల కొట్టు వారికి ఉపాధి విషయంలో క్లారిటీ ఇవ్వాలన్నారు. సీపీఎం నేతలు మాట్లాడుతూ దుకాణదారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. బీఆర్ఎస్​ నాయకుడు ఆకోజు సునీల్  మాట్లాడుతూ అభివృద్ధిని స్వాగతిస్తున్నామని, నిర్వాసితులకు, చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం పీసా గ్రామసభలో ఆలయ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణపై తీర్మానం చేసి ఆమోదించారు.