- సైజ్ రూ. 10.22 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రిమస్ పార్టనర్స్ అంచనా
- ఫీచర్లు పెరుగుతుండడంతో బండ్ల ధరలు పైకి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ (వెహికల్స్) ఇండస్ట్రీ సైజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10.22 లక్షల కోట్లకు చేరుకుంటుందని కన్సల్టింగ్ కంపెనీ ప్రిమస్ పార్టనర్స్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్కు(ఎస్యూవీలకు) డిమాండ్ భారీగా పెరగడంతో కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇండస్ట్రీ సైజ్ 19 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. 2024–25 లో అమ్ముడయ్యే మొత్తం బండ్ల సంఖ్య 10 శాతం పెరుగుతుందని పేర్కొంది.
ఎస్యూవీ సెగ్మెంట్లో చాలా మార్పులు వచ్చాయని ప్రిమస్ పార్టనర్స్ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం అమ్ముడవుతున్న కార్లలో 23 శాతం వాటా ఎస్యూవీలది ఉండగా, వీటి మొత్తం విలువలో ఎస్యూవీల వాటా 16 శాతం ఉంది. దీంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన మొత్తం బండ్ల విలువ 39 శాతం పెరిగిందని ప్రిమస్ పార్టనర్స్ రిపోర్ట్ పేర్కొంది. ముడిసరుకుల ధరలు పెరగడం వంటి కారణాలతో కిందటి ఆర్థిక సంవత్సరంలో బండ్ల రేట్లు పెరిగాయని తెలిపింది. పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతోందని, హైబ్రిడ్ , ఆటోమెటిక్, ఎలక్ట్రిక్ బండ్ల వైపు కన్జూమర్లు చూస్తున్నారని, సన్రూఫ్ కార్లకు డిమాండ్ ఎక్కువయ్యిందని వివరించింది.
పెద్ద కార్లకే మొగ్గు
ఖరీదైన కార్లను కొనడానికి ఇండియన్లు ఆసక్తి చూపిస్తున్నారని ప్రిమస్ పార్టనర్స్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో కారు సగటు ధర పెరుగుతోందని వెల్లడించింది. ‘ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇండియా కీలకంగా ఉంది. తయారీలో ఇతర దేశాలతో పోటీ పడుతోంది. తక్కువ రేటున్న బండ్ల కంటే ఎక్కువ ఫీచర్లున్న, ఖరీదైన బండ్లను తయారు చేస్తోంది. కన్జూమర్ల ఆలోచన విధానాలు మారడం, ఎకానమీ స్ట్రాంగ్గా ఉండడంతో ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మార్పులు కనిపిస్తున్నాయి. వినియోగదారులు ఎస్యూవీలు, యుటిలిటీ వెహికల్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ప్రిమస్ పార్టనర్స్ ఎండీ అనురాగ్ సింగ్ అన్నారు. టూవీలర్ అమ్మకాలు కిందటి ఆర్థిక సంవత్సరంలో 10 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరగగా, వీటి మొత్తం విలువ 13 శాతం పెరిగింది. త్రీవీలర్ అమ్మకాలు 16 శాతం పెరిగాయి.
టూవీలర్ల తయారీలో టాప్
రిజిస్టర్ అయిన మొత్తం బండ్లను చూస్తే గ్లోబల్గా మూడో ప్లేస్ (సైజ్ పరంగా) లో ఇండియా ఉంది. మనకంటే ముందు యూఎస్, చైనా ఉన్నాయి. అమ్ముడవుతున్న బండ్ల విలువ ప్రకారం జపాన్, జర్మనీ వంటి దేశాల వెనక ఇండియా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో బండ్ల ధరలు తక్కువగా ఉంటాయి. అమ్ముడవుతున్న బండ్ల సంఖ్య కంటే వీటి మొత్తం విలువ వేగంగా పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
ప్రిమస్ పార్టనర్స్ రిపోర్ట్ ప్రకారం, టూవీలర్లను తయారు చేస్తున్న దేశాల్లో ఇండియా టాప్లో ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల యూనిట్లు ఇండియాలో అమ్ముడయ్యాయి. అమ్ముడవుతున్న మొత్తం బండ్లలో టూవీలర్ల వాటా 76 శాతంగా ఉంది. మొత్తం విలువలో వీటి వాటా 18 శాతం ఉంది.