
- ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఘటన
- సంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికిన మరొకరు
కారేపల్లి, వెలుగు : వంట చేయడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యని హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గురువారం జరిగింది. ఎస్సై రాజారాం తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్లోని దోదూరి గ్రామానికి చెందిన కమలేశ్ తన భార్య పింకీ మరావి (30)తో కలిసి కారేపల్లి మండలంలోని జైత్రాంతండాకు వలస వచ్చాడు.
తండా బయట గుడారాలు ఏర్పాటు చేసుకొని మిర్చి ఏరే కూలీకి వెళ్తున్నారు. వంట చేసే విషయంలో భార్యాభర్తల మధ్య గురువారం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కమలేశ్ పింకీ కడుపులో తన్నాడు. బలంగా తన్నడంతో తీవ్రంగా గాయపడిన పింకీ అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న కారేపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కమలేశ్ను అదుపులోకి తీసుకున్నారు.
తాగిన మైకంలో...
కంగ్టి, వెలుగు : మద్యం మత్తులో ఓ వ్యక్తి గొడ్డలితో నరికి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కా వడ్గవ్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గుండప్ప గురువారం మద్యం తాగి వచ్చి భార్య చంద్రమ్మ (46) తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన గుండప్ప గొడ్డలితో చంద్రమ్మపై దాడి చేశాడు. తీవ్ర గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుండప్పను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.