
తెలుగు రాష్ట్రాల్లో కీలక మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు -బీబీనగర్, డోన్-మహబూబ్ నగర్, డబ్లింగ్కు కేంద్రం అనుమతిచ్చింది.
తెలంగాణలో వివిధ రూట్లలో 433.82 కిలో మీటర్ల మేర నూతన రైల్వే లైన్లను కేంద్ర నిర్మించనుంది. ఇందులో భాగంగా గుంటూరు -బీబీనగర్ మార్గం డబ్లింగ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 239 కి.మీ పొడవైన ఈ మార్గాన్ని రూ.3,238 కోట్లతో నిర్మించనుంది. దీని ద్వారా హైదరాబాద్ -చెన్నై మధ్య 76 కిలో మీటర్ల మేర దూరం తగ్గనుంది. అలాగే హైదరాబాద్ -విజయవాడ మధ్య కూడా దూరం తగ్గనుంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల రైళ్ల వేగం పెరగడంతో పాటు.. గూడ్సు రవాణాకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
ముద్కేఢ్ – మేడ్చల్ డబ్లింగ్, డోన్ -మహబూబ్ నగర్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 502.34 కిలో మీటర్ల పొడవైన ఈ మార్గాన్ని రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో చేపటనుంది. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే..హైదరాబాద్ – బెంగళూరు మధ్య 50 కిలో మీటర్ల మేర దూరం తగ్గనుంది. దీంతో పాటు.. కొత్త మార్గం పూర్తయితే వందే భారత్ వంటి రైళ్లకు ఉపయోగకరం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రూట్లలో నూతన రైల్వే స్టేషన్లు నిర్మితం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం నుంచి ఖుర్దా రోడ్ మీదుగా నెర్గుండి వరకు 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 417.6 కి.మీల మేర రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో ఈ మూడో లైన్కు ఆమోదముద్ర వేసింది. కటక్ (నెర్గుండి) నుంచి విశాఖపట్నం (విజయనగరం) మధ్య 3 లైన్ల ద్వారా రైల్వే సామర్థ్యం పెరగనుంది.