హనుమకొండ సిటీ, వెలుగు: విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంబురాలను శుక్రవారం బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో గ్రాండ్ గా నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగీత, నృత్య ప్రదర్శనలిచ్చారు. చీఫ్ గెస్ట్గా హాజరైన హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య త్యాగరాజ ఆరాధనలో భాగంగా కళాకారులు, కళాశాల అధ్యాపకులతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు.
అనంతరం హైదరాబాద్ కు చెందిన పలువురు కళాకారులతో పాటు స్థానిక కళాకారులు పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించగా కలెక్టర్ తిలకించారు. విద్యారణ్య కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు భాస్కర్, అనుముల యోష, హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓని విజయ్ తదితరులు పాల్గొన్నారు.