కాలికి గాయమైందని దవాఖానకు పోతే మహిళ ప్రాణం పోయింది!

కాలికి గాయమైందని దవాఖానకు పోతే  మహిళ ప్రాణం పోయింది!
  • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యుల ఆందోళన

చేవెళ్ల, వెలుగు: కాలికి గాయమైందని ఓ మహిళ దవాఖానకు పోతే.. ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మొయినాబాద్ మండలం అండాపూర్ కు చెందిన మద్యపాగ రమేశ్​ భార్య సావిత్రి (30) ఐదు రోజుల కిందట ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కిందపడగా కాలికి తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు స్థానిక భాస్కర ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి శుక్రవారం ఉదయం ఆమె కాలికి  సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. సాయంత్రం అయినా చూపించకపోవడంతో  అనుమానించిన కుటుంబసభ్యులు డాక్టర్లను ప్రశ్నించారు. 

అనంతరం ఆమెను చూపించగా.. అపస్మారక స్థితిలో ఉండగా మరోసారి డాక్టర్లను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు.  అప్పటికే సావిత్రి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భారీగా దవాఖాన వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆమె మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.  సమాచారం అందడంతో  మొయినాబాద్ పోలీసులు వెళ్లారు.