628 ధాన్యం కొనుగోలు సెంటర్లు.. 3.62 లక్షల టన్నులు

628 ధాన్యం కొనుగోలు సెంటర్లు.. 3.62 లక్షల టన్నులు
  • మంచిర్యాల, నిర్మల్​ జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
  • ఈ నెల మూడో వారంలో సెంటర్లు ప్రారంభం 
  • డీసీఎమ్మెస్ ​ఔట్.. మహిళా సంఘాలకు ప్రాధాన్యం

మంచిర్యాల, వెలుగు: యాసంగి వరి కోతలు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం రెడీ అవుతోంది. ఈసారి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 320 సెంటర్లు ఏర్పాటుచేసి 2 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం సేకరించాలని టార్గెట్​గా పెట్టుకుంది. నిర్మల్​ జిల్లా వ్యాప్తంగా 308 సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నెల మూడో వారంలో సెంటర్లను ఓపెన్​ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ​జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం తక్కువ కాగా, కోతలు ఇప్పుడే మొదలయ్యేలా కనిపించడంలేదు. 

సగానికి పైగా సన్నాలే..

రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్​ సీజన్​ నుంచి సన్నాలు క్వింటాలుకు రూ.500 బోనస్​ ప్రకటించడం తెలిసిందే. దీంతో ఈ యాసంగిలోనూ మెజారిటీ రైతులు సన్నాలు సాగు చేశారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టగా, ఇందులో 70 శాతం సన్న రకాలు వేశారు. మొత్తం 3 లక్షల 30 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిర్మల్​ జిల్లాలో 1,17,850 ఎకరాలు వరి సాగు చేశారు. 1,62,414 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం గ్రేడ్​ఏ రకం క్వింటాలుకు రూ.2,320, గ్రేడ్​ బీ రకం రూ.2,300 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. సన్నాలకు బోనస్​రూ.500 కలిపి క్వింటాలుకు రూ.2,820 చెల్లించనున్నారు. 

మహిళా సంఘాలకు ప్రాధాన్యం

కాంగ్రెస్​ సర్కారు మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వహణలోనూ వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ జోక్యం, అవినీతి అక్రమాలు జరుగుతున్నందున ఈసారి డీసీఎమ్మెస్ ​సెంటర్లను రద్దు చేశారు.

డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ, మెప్మా సంఘాలకు ఎక్కువ సంఖ్యలో సెంటర్లను కేటాయించారు. అలాగే పీఏసీఎస్​(పాక్స్)లకు సైతం సెంటర్లను కేటాయించారు. ఈ మేరకు గ్రామాల వారిగా డీఆర్డీఏ, పాక్స్​సెంటర్ల లిస్టులు రెడీ చేశారు. సెంటర్ల నిర్వాహకులు, రైస్ ​మిల్లర్లు, ట్రాన్స్​పోర్టు కాంట్రాక్టర్లతో గత సోమవారం అడిషనల్​కలెక్టర్​(రెవెన్యూ) సబావత్​ మోతీలాల్ మీటింగ్​ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు చేశారు. 

డీఫాల్ట్​ మిల్లులకు నో

మంచిర్యాల జిల్లాలో మొత్తం 54 రైస్​మిల్లులు ఉండగా ప్రభుత్వానికి దాదాపు రూ.130 కోట్ల విలువైన సీఎమ్మార్​ ధాన్యం అప్పజెప్పాల్సి ఉంది. దీంతో ఈ మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్​ ప్రయోగించడమే కాకుండా క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే డీఫాల్ట్​ మిల్లులకు ఈసారి యాసంగి ధాన్యం ఇచ్చేది లేదని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 14 బాయిల్డ్​ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ మిల్లులకు కేటాయించగా మిగిలిన ధాన్యాన్ని పక్క జిల్లాల్లోని మిల్లులకు పంపనున్నారు.