
- దాదాపు 75కు పైగా మొబైల్ బెట్టింగ్ యాప్స్
- వాటిలో సుమారు 34 కోట్లకుపైగా బెట్టింగ్ కార్యకలాపాలు
- డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి
హైదరాబాద్, వెలుగు: క్రికెట్ బెట్టింగ్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్గా రూపం మార్చుకుంది. ప్రతి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో ఆన్లైన్ అడ్డాగా ఏటా సుమారు రూ.8,500 కోట్ల(100 బిలియన్ డాలర్లు) బెట్టింగ్ దందా జరుగుతున్నది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైగా బెట్టింగ్ రూపంలో చేతులు మారే అవకాశం ఉన్నది. ప్రముఖ ఆన్లైన్ సర్వే సంస్థ ‘డిజిటల్ ఇండియా ఫౌండేషన్(డీఐఎఫ్)’ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ సంచలన విషయాలను వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఏటా 34 కోట్లకు పైగా బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా.. బెట్టింగ్ పెట్టే వారి సంఖ్య ఏటా 30% చొప్పున పెరుగుతున్నట్లు నివేదిక తేల్చింది. ఆన్లైన్, మొబైల్ అప్లికేషన్లు కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్పై -గత 17 ఐపీఎల్ సీజన్లను విశ్లేషించిన డీఐఎఫ్.. తన నివేదికను మార్చిలో విడుదల చేయగా, తాజాగా వెలుగుచూసింది. బెట్టింగ్ యాప్స్, ఆర్గనైజర్ల టర్నోవర్, విదేశాలకు మనీలాండరింగ్ సహా పలు కీలక వివరాలను డీఐఎఫ్ తన రిపోర్టులో ప్రస్తావించింది.
యూపీఐల ద్వారా ప్రతి నెలా రూ.2,500 కోట్లు
నకిలీ పేర్లతో సర్రోగేట్, మిర్రర్ సైట్ల ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. బెట్టింగ్ డబ్బు డిపాజిట్లు, ట్రాన్స్ఫర్ కోసం మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నారు. యూపీఐ ఆపరేటర్లు ఐపీఎల్ సీజన్లో జూదం, అక్రమ బెట్టింగ్కు సంబంధించిన లావాదేవీలను భారీగా జరుపుతున్నట్లు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది. ఇలా ప్రతి నెలా కనీసం రూ.2,500 కోట్లు(300 యూఎస్ డాలర్లు)ఇతర దేశాలకు మనీ లాండరింగ్ జరుగుతోందని వివరించింది. ఇదంతా క్రిప్టో కరెన్సీ రూపంలో దేశాలు దాటుతున్నట్లు చెప్పింది.
బెట్టింగ్ మాఫియా తన ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రభుత్వం అనుమతులకు లోబడే నిర్వహిస్తుంటాయి. పలు గేమింగ్ యాప్లకు లీగల్గా అనుమనుతులు ఉన్నాయి. జీఎస్టీ కూడా చెల్లిస్తుంటాయి. అయితే, ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఇల్లీగల్ బెట్టింగ్ దందా వెనుక ఆపరేటర్లకు సుమారు 5 బిలియన్ల డాలర్లు(రూ.500కోట్లు) సంపాదిస్తున్నారని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది. ఫేక్సైట్లు, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశాలు దాటుతున్న మనీలాండరింగ్ను ఛేదించడం సవాళ్లతో కూడుకున్నదని రిపోర్ట్ పేర్కొంది.
ఇన్ఫ్లుయెన్సర్లతో వల
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ టూల్స్తో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ పరిశీలనలో వెలుగు చూసింది. సోషల్ మీడియా విస్తృతి పెరిగాక బెట్టింగ్ మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కేవలం నాలుగైదు టాప్ సైట్లు -ఏడాదికి సుమారు 162 కోట్ల సందర్శకులను ఆకర్శిస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్లలో బెట్టింగ్ యాప్ల ప్రకటనలు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి.
-ఇన్ఫ్లుయెన్సర్లతో బెట్టింగ్ పెట్టేవారికి వల విసరుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో దాదాపు 75 యాప్లు.. బెట్టింగ్ రాకెట్నిర్వహిస్తున్నట్టు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది. డెఫబెట్, 1ఎక్స్ బెట్, పరిమ్యాచ్, 4రాబెట్,బీసీ డాట్గేమ్, 22 బెట్స్, 10సీ సీఆర్ఐసీ, మెల్బెట్, మేట్బెట్, 1 ఎక్స్బెట్, రాజా బెట్స్, స్టేక్డాట్కామ్, డఫ్పా బెట్తో పాటు మియాపూర్, పంజాగుట్ట పీఎస్లలో నమోదైన కేసులకు సంబంధించిన 25 యాప్స్ కూడా ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
ఆఫర్ల పేరుతో పంటర్లకు ట్రాప్
కొన్నేండ్ల క్రితం క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, లాడ్జిల్లో బెట్టింగ్ నిర్వహించేవారు. టీవీల ముందు కూర్చుని టాస్ నుంచి గెలుపు, ఓటముల వరకు నగదు రూపంలో చెల్లింపులు జరిగేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక్క క్లిక్తో డబ్బులు రావడమో లేక పోవడమో అంతా ఆటోమెటిక్గా జరిగిపోతోంది. దీంతో దేశంలో వ్యవస్థీకృతమైన ఆన్లైన్ మాఫియా ఏర్పడి.. పకడ్బందీగా బెట్టింగ్ దందా నిర్వహి స్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లు, ఆన్లైన్ ద్వారా మారుమూల పల్లెలకు కూడా ఇది విస్తరించింది.
క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయంటే చాలు.. టాస్ మొదలుకుని మ్యాచ్లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ బెట్టింగ్ మాఫియా ఆన్లైన్లో ఎత్తులు వేస్తోంది. మొబైల్ యాప్స్లో ఆఫర్ల పేరుతో పంటర్ల(బెట్టింగ్ పెట్టే వ్యక్తులు)ను ఆకట్టుకుంటోంది. స్పోర్ట్స్రాడార్, బెట్వంటి మ్యాచ్ల రియల్ టైమ్ డేటా ఫీడ్ను సెకనులో వెయ్యోవంతు అంటే..మిల్లీ సెకన్ సమయం లోనే అప్డేట్ చేస్తున్నాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక స్పష్టం చేసింది.