10th class Exams: అంబులెన్స్​ లో వచ్చి .. స్ట్రెచర్‌‌పైనే ఎగ్జామ్‌‌..

10th class Exams: అంబులెన్స్​ లో వచ్చి .. స్ట్రెచర్‌‌పైనే ఎగ్జామ్‌‌..
  • మరొకరు తండ్రి చనిపోయిన బాధలో.. ఇంకొకరికి ఎగ్జామ్ రాస్తుండగానే ఫిట్స్​

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రమాదవశాత్తు గాయపడిన ఓ టెన్త్‌‌ స్టూడెంట్‌‌ శుక్రవారం అంబులెన్స్‌‌లో ఎగ్జామ్‌‌ సెంటర్‌‌కు వచ్చి, మరో విద్యార్థి సాయంతో ఎగ్జామ్‌‌ రాశాడు. సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌‌నగర్‌‌కు చెందిన పర్వతం శంకర్‌‌ కూతురు శ్వేత అర్బన్ మండలం మిట్టపల్లి గురుకుల స్కూల్‌‌లో టెన్త్‌‌ చదువుతోంది. 

రెండు రోజుల కింద జ్వరం రావడం గురువారం తండ్రితో కలిసి బైక్‌‌పై హాస్పిటల్‌‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా బైక్‌‌లో కాలు ఇరుక్కుపోవడంతో కిందపడి తీవ్రంగా గాయపడింది. విషయాన్ని విద్యాశాఖ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లగా మరో స్టూడెంట్‌‌ సహకారంతో ఎగ్జామ్‌‌ రాసేందుకు పర్మిషన్‌‌ ఇచ్చారు. దీంతో అంబులెన్స్‌‌లో రంగధాంపల్లి హైస్కూల్‌‌లోని సెంటర్‌‌కు వచ్చిన శ్వేత స్ట్రెచర్‌‌పైనే పడుకొని ఎగ్జామ్‌‌కు హాజరైంది.

తండ్రి చనిపోయిన బాధలోనే...

బెల్లంపల్లిరూరల్, వెలుగు : తండ్రి చనిపోయిన బాధతోనే ఓ స్టూడెంట్‌‌ టెన్త్‌‌ ఎగ్జామ్‌‌కు హాజరైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్‌‌ గ్రామానికి చెందిన మంచర్ల శ్రీలత టెన్త్‌‌ చదువుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి మల్లయ్య గురువారం రాత్రి చనిపోయాడు. శుక్రవారం టెన్త్‌‌ ఎగ్జామ్‌‌కు ఉండడంతో తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకోని శ్రీలత ఎగ్జామ్‌‌కు హాజరైంది. 

 ఎగ్జామ్‌‌ రాస్తుండగానే ఫిట్స్‌‌

నేలకొండపల్లి, వెలుగు : టెన్త్‌‌ ఎగ్జామ్‌‌ రాస్తుండగానే ఓ స్టూడెంట్‌‌ ఫిట్స్‌‌తో కిందపడిపోయాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెం గ్రామానికి చెందిన బోయిన ధనుశ్‌‌ చెరువుమాదారం జడ్పీహెచ్‌‌ఎస్‌‌లో టెన్త్‌‌ చదువుతున్నాడు. శుక్రవారం ఎగ్జామ్‌‌కు హాజరైన ధనుశ్‌‌ సడన్‌‌గా ఫిట్స్‌‌తో కిందపడిపోయాడు. గమనించిన సిబ్బంది వెంటనే నేలకొండపల్లి హాస్పిటల్‌‌కు తీసుకెళ్లగా ట్రీట్‌‌మెంట్‌‌ చేశారు. ధనుశ్‌‌ పరీక్ష రాసేందుకు పట్టుబట్టడంతో అంబులెన్స్‌‌లో సెలైన్‌‌ బాటిల్‌‌తోనే తిరిగి సెంటర్‌‌కు తీసుకురాగా.. ఎగ్జామ్‌‌ పూర్తి చేశాడు.