న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్లో భద్రతాదళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత కుకీ మిలిటెంట్లు మృతిచెందారు. కుకీ టెర్రరిస్టులు జిరిబామ్లోని పోలీస్ స్టేషన్పై కాల్పులకు తెగబడడంతో ఎన్కౌంటర్ జరిగినట్లు సీఆర్పీఎఫ్వర్గాలు తెలిపాయి.
సోమవారం మధ్యాహ్నం జిరిబామ్ జిల్లాలోని బోరోబెక్రాలోని పోలీసు స్టేషన్పై అనుమానిత కుకీ టెర్రరిస్టులు రెండు వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ పక్కనే నిర్వాసితుల శిబిరం కూడా ఉంది. అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వారిపై ఫైరింగ్ స్టార్ట్ చేశాయి. కొద్ది సేపు భీకరంగా కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్కౌంటర్లో 11 మంది కుకీ టెర్రరిస్టులు చనిపోయారు. పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు.