
పటాన్చెరు (గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంప్యార్డు నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. 60 రోజులకు పైగా నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల మండల జేఏసీ ఆధ్వర్యంలో డంప్యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నెల 3న డంప్యార్డుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలపాలని గుమ్మడిదల తహసీల్దార్ఆఫీసు ఆవరణలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.
శుక్రవారం తమ అభిప్రాయాలను తెలిపేందుకు నల్లవల్లి గ్రామస్తులు వందల సంఖ్యలో తహసీల్దార్ ఆఫీసుకు తరలి వచ్చారు. ప్రజలంతా ఒక్కసారిగా రావడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్డీవో రవీందర్ రెడ్డి, అడిషనల్ఎస్పీ సంజీవరావు నేతృత్వంలో పోలీస్ బందోబస్తు మధ్య అభిప్రాయాలను స్వీకరించారు. ఈ క్రమంలో ఒకే రోజు 1190 మంది డంప్యార్డుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను రాత పూర్వకంగా రెవెన్యూ అధికారులకు సమర్పించారు.