
వెల్దుర్తి, వెలుగు: వెల్దుర్తి శివారులో పోలీసుల పెట్రోలింగ్లో రూ.12 లక్షల నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా శ్రీరంగవరం గ్రామానికి చెందిన లక్ష్మీ వద్ద రూ.12 లక్షల నగదు పట్టుకున్నట్లు తూప్రాన్ సీఐ శ్రీధర్ తెలిపారు. పట్టుకున్న నగదును మెదక్ ఎన్నికల మానిటరింగ్ అధికారులకు అప్పగిస్తామని, విచారణ జరిపిన తరువాత సంబంధిత పత్రాలు పరిశీలించి నగదును అప్పగిస్తామని వివరించారు.
ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తాము వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో భూమి కొనుగోలు చేశామని, ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తెచ్చిన డబ్బును పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన స్లాట్ రశీదును చూపించారు. తమ డబ్బులు ఇప్పించాలని ఆమె సీఐకి మొరపెట్టుకున్నారు.
పెద్ద శంకరంపేట్లో రూ. 6.33 లక్షలు
మెదక్ (పెద్దశంకరంపేట్): మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం కోలపల్లి శివారులో పోలీసుల తనిఖీల్లో రూ.6.33 లక్షల నగదు పట్టుబడింది. సీఐ జార్జ్, ఎస్ఐ బాలరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం నుంచి హైదరాబాద్ వెళుతున్న రెండు వెహికల్స్లో ఈ నగదు లభ్యమైందన్నారు. ఒక వెహికల్లో రూ.5.34 లక్షలు, మరో వెహికిల్లో రూ.99.500 లు ఉన్నాయని తెలిపారు. ఈ డబ్బులను ఉన్నతాధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు.
అక్కన్న పేట శివారులో రూ.లక్ష
రామాయంపేట: మండలంలోని అక్కన్నపేట శివారులో పోలీసులు రూ.లక్ష పట్టుకున్నారు. మండలంలోని అక్కన్నపేటకు చెందిన దుర్గయ్య మోటార్ సైకిల్ పై రామాయంపేట నుంచి అక్కన్నపేటకు వెళుతుండగా పోలీసులు చెక్ చేసి రూ.లక్ష గుర్తించారు. డబ్బుకి సంబంధించి ఎలాంటి పత్రాలు లేనందున స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు.
కంగ్టి: కంగ్టి, తడ్కల్ గ్రామం మధ్యలో పోలీసులు వాహన తనఖీలు చేస్తుండగా రూ.98వేలు పట్టుబడ్డాయని ఎస్ఐ విశ్వజన్ పేర్కొన్నారు. డబ్బుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.