పాక్​లో 12 మంది టెర్రరిస్టులు హతం

పాక్​లో 12 మంది టెర్రరిస్టులు హతం
  • రెండుచోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో ఆరుగురు సైనికులు మృతి

పెషావర్: పాకిస్తాన్​లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో భారీ ఎన్ కౌంటర్​లు చోటుచేసుకున్నాయి. రెండు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది టెర్రరిస్టులను సైన్యం, పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఘటనలలో ఆరుగురు సైనికులు కూడా చనిపోయారు. గురు, శుక్ర వారాల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లోని ఉత్తర, దక్షిణ వజీరిస్తాన్ జిల్లాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయని ఆర్మీ మీడియా విభాగం తెలిపింది. తెహ్రీక్- ఈ -తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఈ దాడులు చేసినట్టు తెలిపింది.

గురువారం నార్త్ వజీరిస్తాన్ జిల్లాలోని స్పిన్ వామ్​లో ఏడుగురు మిలిటెంట్ల బృందం అఫ్గాన్ నుంచి పాక్​లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. భద్రతా బలగాలు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మిలిటెంట్లు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.

లాధాలో చెక్ పోస్ట్​పై దాడి..

దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని లాధా తహసీల్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. మిష్టా గ్రామంలోని సెక్యూరిటీ చెక్ పోస్ట్‌‌‌‌పై మిలిటెంట్ల బృందం దాడి చేసింది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో  ఐదుగురు టెర్రరిస్టులు, ఆరుగురు సైనికులు చనిపోయారు.