మనీలాండరింగ్ పేరుతో రూ.1.22 కోట్లు కొట్టేశారు

మనీలాండరింగ్ పేరుతో రూ.1.22 కోట్లు కొట్టేశారు

గచ్చిబౌలి, వెలుగు : మనీలాండరింగ్ పాల్పడ్డారని ఓ మహిళను ఐదు రోజుల పాటు డిజిటల్​అరెస్ట్​ చేసి, సైబర్ నేరగాళ్లు రూ. 1.22 కోట్లు కొట్టేశారు. కూకట్​పల్లికి చెందిన 40 ఏళ్ల ఐటీ ఉద్యోగికి సెప్టెంబర్​2న సైబర్ చీటర్స్ కాల్ చేశారు. తనను ఢిల్లీలోని ఆర్సీపురం పోలీస్​స్టేషన్ హెడ్​కానిస్టేబుల్​ గౌరవ్ ​శుక్లాగా పరిచయం చేసుకొని ఆమెతో మాట్లాడారు. ఢిల్లీ హైకోర్టులో బాధితురాలి పేరుపై వివాదం ఉందని, ఆమె బ్యాంక్​ అకౌంట్ల ద్వారా రూ. 25 లక్షలు మనీలాండరింగ్​జరిగినట్లు భయపెట్టారు.

ఈ కేసును డీసీపీ రాజేశ్​డియో పర్యక్షవేక్షిస్తున్నాడని చెప్పి, ఐదు రోజులు బాధితురాలిని ఆమె ఇంట్లోనే స్కైప్​, వాట్సాప్​ ద్వారా పర్యవేక్షిస్తూ డిజిటల్ అరెస్ట్​  చేశారు. కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపాలని, రూ.1.22 కోట్లను ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు.

వాటిని వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని నమ్మబలికిన సైబర్ కేటుగాళ్లు.. ఆ తర్వాత స్పందించలేదు. దీంతో బాధితురాలు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహరాష్ట్ర పుణెకు చెందిన కపిల్​కుమార్​ను శనివారం అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు.