13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు

13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు

చెన్నై: ఎన్​సీసీ క్యాంపు అంటూ నమ్మించి 13 మంది ప్రైవేట్ స్కూల్ అమ్మాయిలపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఆగస్టు మొదటివారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. క్యాంప్ నిర్వాహకుడు, స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, ఇద్దరు టీచర్లు సహా మొత్తం 11 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. 

ప్రిన్సిపాల్​కు తెలిసినా పట్టించుకోలే..

నామ్ తమిళర్ కచ్చి అనే పొలిటికల్ పార్టీకి చెందిన శివరామన్ తన అనుచరులతో కలిసి ఇటీవల కృష్ణగిరిలోని ఓ ప్రైవేటు స్కూల్​కు వెళ్లాడు. స్కూల్​లో ఎన్​సీసీ క్యాంప్​ నిర్వహిస్తే స్కూల్​కు ఎన్​సీసీ యూనిట్ పర్మిషన్ వస్తుందని నమ్మించాడు. దీనిపై సరిగా విచారించకుండానే ప్రిన్సిపాల్ ఓకే చెప్పి, స్కూలులో క్యాంప్ ఏర్పాటుకు అనుమతిచ్చాడు. ఆగస్టు 5 నుంచి 9వ తేదీవరకు నిర్వహించిన ఈ క్యాంప్​లో 17 మంది బాలికలు సహా మొత్తం 41 మంది పాల్గొన్నారు. అమ్మాయిలకు అబ్బాయిలకు వేర్వేరుగా వసతి కల్పించారు. అయితే, స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లలను పర్యవేక్షించేందుకు టీచర్లను నియమించలేదు. 

దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న శివరామన్.. ఓ రోజు రాత్రి 13 ఏండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలా మూడ్రోజుల్లో మొత్తం 13 మందిని వేధింపులకు గురిచేశాడు. క్యాంప్ ముగియగానే ఈ విషయాన్ని అమ్మాయిలు స్కూల్ ప్రిన్సిపాల్​కు చెప్పగా, తమ పరువు పోతుందని ఆయన పట్టించుకోలేదు. దీంతో బాధిత విద్యార్థినిలు వాళ్ల పేరెంట్స్​కు విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరామన్, ప్రిన్సిపాల్, టీచర్లు సహా పోలీసులు11 మందిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నిందితుడు ఇలాంటి నకిలీ క్యాంపులను గతంలోనూ నిర్వహించాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

నర్సుపై డాక్టర్ అత్యాచారం

ఉత్తరప్రదేశ్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న నర్సుపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు బాధితురాలి తోటి ఉద్యోగి, వార్డ్ బాయ్ డాక్టర్​కు సహకరించారు. ఆదివారం నైట్ డ్యూటీకి వచ్చిన నర్సు మీనా(20)ను మరో నర్సు మెహనాజ్ డాక్టర్​ను కలవమని చెప్పింది. అందుకు ఆమె నిరాకరించడంతో మెహనాజ్, వార్డ్ బాయ్ కలిసి మీనాను బలవంతంగా డాక్టర్ గదిలోకి లాక్కెళ్లారు. ఆపై రూమ్​కు బయటనుంచి తాళం వేశారు. తర్వాత డాక్టర్ షానవాజ్ తనను కట్టేసి రేప్ చేశాడని, చంపేస్తామని బెదిరించి వదిలేశాడని మీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్​ను అతడికి సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచనలతో ఆస్పత్రిని సీజ్ చేశారు.

అరుణాచల్​లో 13 ఏండ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్

పదమూడేండ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై ఐదురోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అరుణాల్ ప్రదేశ్​లోని డపోరిజోలో ఈ దారుణం జరిగింది. జులై 22న ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఐదుగురు యువకులు ఎత్తుకెళ్లారు. ఆపై ఐదురోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.