మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు

మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు
  • మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు
  • రూ.105 కోట్లతో చేపట్టిన పనులు 95 శాతం పూర్తి
  • 4 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందితో వర్క్స్​ 
  • జంపన్న వాగుకు 14న లక్నవరం నీళ్లు 
  • ములుగు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి
  • జాతరకు డ్యూటీలో 14 వేల మంది పోలీసులు: ములుగు ఎస్పీ శబరీశ్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు :  ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు ములుగు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎస్పీ శబరీశ్‌‌తో కలిసి గురువారం మేడారంలోని హరిత హోటల్​లో  మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు. కలెక్టర్‌‌ మాట్లాడుతూ మహాజాతరలో శాశ్వత, తాత్కాలిక అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లు కేటాయించిందన్నారు. మంత్రి సీతక్క సూచనల మేరకు ఇప్పటికే చేపట్టిన పనుల్లో 95 శాతం కంప్లీట్‌‌ అయ్యాయన్నారు. జాతరలో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాల్లో గిరిజన పెయింటింగ్స్ వేయిస్తున్నామన్నారు. అలాగే 4 వేల మంది పారిశుధ్య కార్మికులను అందుబాటులో ఉంచామన్నారు.

ఐటీసీ, సింగరేణి సంస్థల సహకారంతో స్పెషల్​మెషినరీని తెప్పించి పారిశుధ్య పనులు చేయిస్తామన్నారు. జాతర టైంలో ప్రతి 6 గంటలకు 1400 మెట్రిక్‌‌ టన్నుల వెస్టేజ్‌‌ జనరేట్‌‌ అవుతుందన్నారు. యానిమల్ కంపోజ్, టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్‌‌డబ్ల్యుఎస్‌‌ ఆధ్వర్యంలో 14 క్లస్టర్లలో 279 యూనిట్ల ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 230 కొత్త బోర్ వెల్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగు లోతట్టు ప్రాంతాల్లో, రద్దీ ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. జంపన్నవాగులో మోకాలు లోతు నీళ్లుండే విధంగా చూస్తామని, ఈ నెల14న లక్నవరం నీటిని రిలీజ్‌‌ చేస్తామన్నారు. వైద్యా ఆరోగ్య శాఖ తరపున 30 స్పెషల్​హెల్త్ క్యాంప్స్, 6 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. ఆర్టీసీ మహిళ సిబ్బందికి టికెట్ కౌంటర్స్ దగ్గర ప్రత్యేక వసతి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 

వనదేవతలు వచ్చే టైంలో స్పెషల్​టెక్నాలజీ

ఎస్పీ శబరీశ్​ మాట్లాడుతూ జాతరలో 14 వేల మంది పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహిస్తారన్నారు. వనదేవతలను తీసుకొచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అప్పుడు రోప్ పార్టీ ద్వారా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి స్పెషల్​టెక్నాలజీ ఉపయోగించనున్నట్టు చెప్పారు. 500 సీసీ కెమెరాలు, 5 డ్రోన్‌‌ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్  ద్వారా పరిశీలిస్తామన్నారు. వీఐపీ , వీవీఐపీల దర్శనం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ నెల 23న జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాజాతర వన్‌‌ వే రూట్లు, పార్కింగ్‌‌ స్థలాలను తెలిపే మొబైల్‌‌ యాప్‌‌ను ఈ నెల 13న రిలీజ్‌‌ చేస్తామన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్​కలెక్టర్ పి శ్రీజ, ఏటూరునాగారం అడిషనల్​ఎస్పీ సిరిషేట్టి సంకీర్త్ , దేవాదాయ శాఖ ఆఫీసర్​ రాజేందర్ పాల్గొన్నారు.